ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : పార్లమెంట్లో ఆందోళన కొనసాగిస్తాం : ఏపి ఎంపీల నిరసన..
ఏపికి ప్రత్యేక హోదా డిమాండ్..పెండింగ్ హామీల అమలు పై పార్లమెంట్ వేదికగా ఏపి ఎంపీలు నిరసనకు సిద్దం అవుతు న్నారు. వచ్చే సమావేశాలు కేవలం ఓన్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ సమావేశాలు కావటంతో..ప్రస్తుత శీతాకాల సమావేశాల్లోనే దీని పై నిర్ణయం ప్రకటించాలని టిడిపి - వైసిపి డిమాండ్ చేస్తున్నాయి. తొలి రోజు సిట్టింగ్ ఎంపి..మంత్రి అనంతకుమార్ మృతికి సంతాపంగా సభ వాయిదా పడనుంది. జనవరి వరకు కొనసాగనున్న ఈ సమావేశాల్లో తమ వాయిస్ బలంగా విని పించాలని రెండు పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి ఇదే చివరి అవకాశమని, ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలుపై ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ప్రకటించాలని టిడిపి - వైసిపి డిమాండ్ చేస్తున్నాయి. ఢిల్లీలో నే ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు పార్టీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. జాతీయ రాజకీయాల్లో భాగంగా.. ప్రస్తుతం కాంగ్రెస్ తో సహా దాదాపు 21 పార్టీలు బిజెపికి వ్యతిరేకంగా ఒక్కటయ్యాయి.
ఇప్పుడు జాతీయ పార్టీల మద్దతు సైతం ఉండటంతో..ఏపికి రావాల్సిన హక్కుల పై పోరాటం చేయాలని చంద్రబాబు పార్టీ ఎంపీలను నిర్ధేశించారు. తొలుత పార్లమెంట్ సమావేశాల నిర్వహణ పై ప్రధాని అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరిగింది. ఆ సమావేశంలోనే టిడిపి - వైసిపి పార్లమెంటరీ పక్ష నేతలు ఇదే అంశాలను డిమాండ్ చేసారు. ఇక, వైసిపి ఎంపీలు ఏపికి ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేసారు. టిడిపి ఎంపీలు ప్రతీ సమావేశాల్లోనూ తమ వాయిస్ ను బలంగా వినిపిస్తు న్నారు. అదే సమయంలో తమ డిమాండ్ల సాధనకు పార్లమెంట్ సమావేశాల సమయంలోనే ఆందోళన కొనసాగిస్తున్నారు.
ఇటు రాజ్యసభలోనూ టిడిపి -వైసిపి సభ్యులు తమ డిమాండ్లను ప్రభుత్వం అమలు చేయాలంటూ ఆందోళన చేసారు. ఇక, ప్రస్తుత సమావేశాల్లోనూ రెండు పార్టీలో పోటా పోటీగా తమ వాయిస్ వినిపించేందుకు ఇప్పటికే డిసైడ్ అయ్యారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న తొలి రోజునే అయిదు రాష్ట్ర ఎన్నికల ఫలితాలు రానున్నాయి. తొలి రోజు మొత్తం ఇదే సభ్యుల మధ్య హట్ టాపిక్ గా మారనుంది. ఇక, కేంద్రాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు మొత్తంగా ఒకే వేదిక మీదకు వచ్చాయి. రఫెల్ కుంభకోణం పై ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్.. ఎదురుదాడితో కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాలని బిజెపి వ్యూహ- ప్రతి వ్యూహలు సిద్దం చేస్తున్నాయి. ఈ సమావేశాల్లో ఏపి అంశాల మీద ప్రధానంగా టిడిపి -వైసిపి ఆందోళనకు దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.