ఇప్పుడు అడగడమా?: కేశినేని-జేసీ తీవ్ర ఆగ్రహం, 'భోజనానికి పిలిచినట్లు'
అమరావతి: బడ్జెట్ పత్రాలు సిద్ధమవుతున్న సమయంలో రైల్వేకి సంబంధించిన ప్రతిపాదనలు ఏమయ్యాయని అని తమను అడగడంలో అర్థం లేదని ఏపీ ఎంపీలు మంగళవారం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది బడ్జెట్ సమావేశాలకు ముందు మొక్కుబడిగా ప్రతిపాదనలు తీసుకోవడం వల్ల లాభం లేదన్నారు.
అవసరాన్నిబట్టి: మోడీ-బాబుల భేటీపై జేసీ మళ్లీ సంచలనం, అపాయింటుమెంట్ సరికాదు
మంగళవారం విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ రాష్ట్ర ఎంపీలతో భేటీ అయ్యారు. టీడీపీ, వైసీపీ ఎంపీలు దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీసం మూడు నెలల ముందు పిలిచి చర్చించాలని, వాటిని పంపిస్తే బడ్జెట్లో చేర్చే అవకాశం ఉంటుందన్నారు. కానీ ఇప్పుడు బడ్జెట్ పత్రాలు తయారవుతున్న సమయంలో ఏం లాభం అన్నారు.
కేశినేని నాని ఏమన్నారంటే
మూడేళ్లలో మార్పు వస్తుందనుకున్నామనీ, కానీ ఏమీ రాలేదని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోడీ భేటీ తర్వాత పలు అంశాలపై స్పష్టత వస్తుందన్నారు. ఈ సమావేశంలో కీలక ప్రాజెక్టులపై చర్చించారని, విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించి, ప్రతిపాదనను కేంద్రానికి పంపించాలని చెప్పామన్నారు.
రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ
సమావేశాలు ఏదో భోజనానికి పిలిచినట్లు ఉన్నాయని నరసారావుపేట ఎంపీ రాయబాటి సాంబశివ రావు ఎద్దేవా చేశారు. నడికుడి-శ్రీకాళహస్తి పనులకు ఇబ్బందులు, కొందరు కలిగిస్తున్న ఆటంకాలపై ప్రధాని మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదులు వెళ్లాయని చెప్పారు. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జోన్ లేకపోవడంతో రైల్వే ఉద్యోగాలకు వెళ్లే యువకులు భువనేశ్వర్, సికింద్రాబాద్లకు వెళ్తూ ఇబ్బందిపడుతున్నారన్నారు.
కోడిపందాలు చూస్తానన్న జేసీ
రాష్ట్రానికి రైల్వే జోన్ విషయంలో పార్లమెంటు సభ్యులేమీ చేయలేరని అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఎంపీలంటే కరివేపాకులేనని, తమ పని ఏముంటుందని, చేయి ఎత్తమంటే ఎత్తాలి, దించమంటే దించాలని వ్యాఖ్యానించారు. రైల్వే జోన్పై చెప్పాల్సింది ప్రధాని చెప్పాలన్నారు. కొద్దిగా మనిషికి భయం ఉంటే అన్నీ వస్తాయని, భయం లేకపోతే విచ్చలవిడితనం వస్తుందన్నారు. సంక్రాంతికి కోడి పందాలు చూసేందుకు వెళ్తాననీ, చూడటంలో తప్పేమీ లేదన్నారు.
రైళ్లలో ఉచితంగా ఆహారం, మంచినీళ్లు
అమలాపురం ఎంపీ రవీంద్రబాబు మాట్లాడుతూ.. జనరల్ బోగీల్లో ఎక్కువగా పేదలు, కార్మికులు ప్రయాణిస్తున్నందున దూర ప్రాంత రైళ్లలో వాళ్లకు ఉచితంగా ఆహారం, మంచినీళ్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్ అంశాన్ని ప్రస్తావించగా కొన్ని సాంకేతికపరమైన అంశాలున్నాయనీ, తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టత కోరామని జీఎం చెప్పారు. కాగా, శ్రీకాకుళం-నడికుడి పనుల్లో వేగం పెంచాలని, రైళ్లలో పరిశుభ్రత, భద్రతలను ఎంపీలు ప్రస్తావించారు.
Recommended Video
పిఠాపురం - కాకినాడ మార్గంపై
కాకినాడ లూప్ లైన్లో ఉందనీ దీన్ని ప్రధాన మార్గంలోకి తేవాలంటే పిఠాపురం-కాకినాడ మార్గం ఏర్పాటుచేయాలన్నదే ఆ ప్రాంతవాసుల చిరకాల కోరికని ఎంపీ తోట నరసింహం అన్నారు. ఈ పనులకు గత రెండు బడ్జెట్ల్లో నిధులు కేటాయించి, ఇప్పుడు దాన్ని పక్కనపెట్టేయడం ఏమిటని ప్రశ్నించారు. తక్షణం ఈ ప్రాజెక్టును పునరుద్ధరించాలన్నారు. దీని మూలంగా కోనసీమ ప్రజలకీ రైల్వేమార్గం మరింత విస్తృతం అవుతుందన్నారు.