నైతికి విజయం బీజేపీ-జనసేనదే: రూటు మార్చిన యామిని: ఈ సారి టీడీపీపై ఫైర్: ఆ ఆశ బలంగా
అమరావతి: రాష్ట్రంలో ముగిసిన మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ సాధించిన ఘన విజయాలపై భారతీయ జనతా పార్టీ నాయకురాలు సాదినేని యామిని స్పందించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమి నైతిక విజయాన్ని సాధించాయని అన్నారు. అధికార పార్టీ అణచివేత చర్యలను ధైర్యంగా ఎదుర్కొంటూ.. తమ కూటమి నాయకులు, కార్యకర్తలు వీరోచితంగా పోరాడారని ప్రశంసించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమికి పెరిగిన ఓట్ల శాతమే దీనికి నిదర్శనమని ఆమె స్పష్టం చేశారు.
రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..?
ఒంటరిగా వైఎస్ షర్మిల: ఇడుపుల పాయలో తండ్రికి నివాళి: ఆ ప్రకటన తరువాత తొలిసారిగా
భయభ్రాంతులకు గురి చేస్తూ..
అధికార వైఎస్సార్సీపీ ప్రజలను ఎన్నో రకాలుగా భయభ్రాంతులకు గురి చేసిందని సాదినేని యామిని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని ఓటర్లను భయ పెట్టారని విమర్శించారు. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు స్వయంగా ఇలాంటి ప్రకటనలు చేశారని, ప్రజల్లో ఆందోళనను కలిగించారని చెప్పారు. తద్వారా రాజకీయ లబ్ది పొందారని ధ్వజమెత్తారు. అలాగే- వలంటీర్ల వ్యవస్థను తమ రాజకీయ లబ్ది కోసం వినియోగించుకున్నారని మండిపడ్డారు.
బీజేపీపై విపరీతమైన విషం..
బీజేపీపై ప్రజల్లో విపరీతమైన విషాన్ని నింపడానికి వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేసిందని, దానికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సహకరించిందని సాదినేని యామిని విమర్శించారు. 2019 నాటి సాధారణ ఎన్నికల సమయంలో అప్పటి అధికార తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బీజేపీ లేకుండా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అయినప్పటికీ.. ప్రజల అండతో వాటిని బీజేపీ ఛేదించగలిగిందని చెప్పారు. ఈ విషయంలో తెలుగుదేశం, వైసీపీ ఘోరంగా విఫలం అయ్యాయని ఆమె అన్నారు.
పోరాడలేకపోతోన్న టీడీపీ
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో తీసుకుంటోన్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, చర్యలు, పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లడంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దారుణంగా విఫలమైందని యామిని విమర్శించారు. ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీని ప్రజలు ఏ మాత్రం గుర్తించట్లేదని, ఆదరించట్లేదనేది స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలో రుజువైందని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికలు ఏకపక్షంగానే సాగాయని ఆమె అంగీకరించారు. అధికార పార్టీ ప్రలోభాలు, బెదిరింపులు పని చేయడం వల్లే ఏకపక్షం సాధ్యమైందని చెప్పారు.
మెరుగుపడిన బీజేపీ ఓట్ల శాతం..
బీజేపీ-జనసేన కూటమికి ఓట్ల శాతం పెరిగడం మార్పునకు శ్రీకారం చుట్టినట్టయిందని యామిని అన్నారు. తమకు పరిమితంగా ఉన్న సొంత వనరులతో బీజేపీ-జనసేన కూటమి తమ ఓటు శాతాన్ని పెంచుకోగలిగాయని చెప్పారు. ఒకపక్క వైసీపీ, మరోవంక తెలుగుదేశం పార్టీ.. బీజేపీ-జనసేనను అణచివేయడానికి విశ్వ ప్రయత్నాలు చేశాయని, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్య కూటమి తమ ఓట్ల శాతాన్ని పెంచుకోవడం హర్షణీయమని చెప్పుకొచ్చారు. బీజేపీ-జనసేన అభ్యర్థులు పోరాట పటిమను ప్రదర్శించారని, అణచివేత చర్యలను ధైర్యంగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు. ఈ ఎన్నికల్లో నైతిక విజయం బీజేపీ-జనసేనదేనని, ప్రధాన ప్రతిపక్షానికి ప్రత్యామ్నాయంగా బీజేపీ-జనసేన కూటమి ఎదుగుతోందనడానికి ఈ ఎన్నికల్లో పెరిగిన ఓటు శాతం నిదర్శనమని వ్యాఖ్యానించారు.