విజయనగరంలో టీడీపీ కోడ్ ఉల్లంఘన: నిమ్మగడ్డ ఏం చేస్తున్నట్టు: సాయిరెడ్డి: చంద్రబాబు సేవలో
అమరావతి: రాష్ట్రంలో నాలుగు విడతల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక అందరి దృష్టీ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలపై పడింది. వచ్చేనెల 10వ తేదీన రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు పోలింగ్ నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇదివరకు విడుదల చేసింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా అన్ని పార్టీలు కూడా ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్నాయి.
నిమ్మగడ్డ మార్క్ ఫైర్: మున్సిపల్ ఎన్నికలకు ముందే: గ్రేటర్ విశాఖ కమిషనర్పై బదిలీ వేటు
ఈ పరిస్థితుల్లో విజయనగరం జిల్లాలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు బహిరంగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు పాల్పడుతున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తోన్నారు. ఓటర్లను ప్రలోభపెడుతోన్నారని, రౌడీయిజానికి దిగుతున్నారని మండిపడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో దారుణంగా ఓటమిపాలైన అనంతరం టీడీపీకి మున్సిపాలిటీల్లోనూ ఓటమి తప్పదని, ఆ భయంతోనే వారు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తోన్నారు.
విజయనగరంలో టీడీపీ నేతలు బహిరంగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తోంటే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏం చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితిని ప్రజలు అద్దంలో చూపించేశారని, మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటమి తప్పదనే అక్కసు టీడీపీ నేతల్లో కనిపిస్తోందని అన్నారు. ఇక చేసేది లేక రౌడీయిజానికి, ప్రలోభాలకు తెగబడుతున్నారని విమర్శించారు. విజయనగరంలో టీడీపీ నేతలు బహిరంగంగానే కోడ్ ఉల్లంఘిస్తోంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుడ్డిగుర్రం పళ్లుతోముతున్నాడా లేక చంద్రబాబు సేవలో తరిస్తున్నాడా అంటూ సాయిరెడ్డి ప్రశ్నించారు.
ఎన్నికల ఫలితాలు తమ అంచనాలకు అనుగుణంగా రాకపోతే ఏ పార్టీ అయినా ఓటమిని హుందాగా స్వీకరిస్తుందని, పరాజయాన్ని సమీక్షించుకుంటామని చెబుతుందని, టీడీపీ మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తోందని సాయిరెడ్డి అన్నారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో 41.7 శాతం ఓట్లు పడ్డాయని సొల్లు మాటలు చెబుతూనే చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మారడని, తను భ్రమల్లో జీవిస్తూ అందరిని అందరినీ అదే భ్రాంతిలో ఉంచాలని చూస్తాడని అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరిగాయని ఎన్నికల కమిషన్, పోలీసు శాఖ వెల్లడించాయని, టీడీపీ అడ్రసు గల్లంతు కావడం వల్లే ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పోయిందని వ్యాఖ్యానించారు.