ఏపీకి నాలుగు రాజధానులు కావాలట ... సాంస్కృతిక రాజధానిగా రాజమండ్రి : మంత్రి శ్రీరంగనాథరాజు డిమాండ్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులపై ప్రకటన చేశారు. ఇక తర్వాత రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల ఆలోచన ఆచరణ సాధ్యమేనా అన్న విషయం అటుంచితే రాజధాని విషయంలో కొనసాగుతున్నరగడ మాటల్లో చెప్పేలా లేదు. టీడీపీ నేతల ఆందోళనలు,ప్రతిపక్ష పార్టీల మాటల దాడి ఒకవైపు కొనసాగుతుంటే రాజధాని విషయంలో వైసీపీ మంత్రులు, నేతల వ్యాఖ్యలు ఈ రచ్చను మరింత పెద్దవిగా చేస్తున్నాయి.
రాజధాని అమరావతి పోరాటం... మరో రైతు కూలీ ఆత్మహత్య .. గ్రామాల్లో ఉద్రిక్తత
నాలుగు రాజధానులు కావాలన్న మంత్రి శ్రీ రంగనాథరాజు
ఎవరికి వారు తమ సొంత అభిప్రాయాలను రాజధాని విషయంలో వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా మూడు రాజధానులకు మద్దతుగా రాజమండ్రిలో వైసీపీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీరంగనాథరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు కాదని నాలుగు రాజధానులుండాలని డిమాండ్ చేశారు. రాజమండ్రిని సాంస్కృతిక రాజధాని చేయాలన్నారు శ్రీరంగనాథరాజు . ఇక అంతా చెప్పిన ఆయన రాజమండ్రి రాజధాని అనేది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు.
సాంస్కృతిక రాజధానిగా రాజమండ్రి
ఇక ఏపీకి నాలుగు రాజధానులు ఉంటె బాగుంటుంది అనే విషయాన్ని అసెంబ్లీ సమాశాల్లో సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని శ్రీరంగనాథరాజు తెలిపారు. రాజమండ్రి సాంస్కృతిక రాజధానిగా మార్చాలని కోరతానన్నారు. ఇక నిన్నటికి నిన్న మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ రాజధాని అమరావతినే ఉండాలన్నది తన కోరిక అని చెప్పారు. ఇలా ఎవరికి వారు వ్యక్తిగత అభిప్రాయాలు వ్యక్తం చెయ్యటం పెద్ద గందరగోళానికి కారణం అవుతుంది.
టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యాఖ్యలపై మండిపడిన మంత్రి
ఇక టీడీపీ నేతలు విశాఖలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడటం కోసమే వైసీపీ రాజధానిని విశాఖకు మారుస్తున్నారని చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉంటే విశాఖలో భూములు ఎలా కొనగలమని ప్రశ్నించారు. రాజకీయ ఉనికి కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి శ్రీరంగనాథరాజు విమర్శించారు. ఏది ఏమైనా జగన్ మూడు రాజధానుల ప్రకటన తర్వాత ఇటీవల తిరుపతి ఆధ్యాత్మిక రాజధానిగా చెయ్యాలని డిమాండ్ వినిపిస్తే, ఇక తాజాగా మంత్రి చేసిన వ్యాఖ్యలతో రాజమండ్రి సాంస్కృతిక రాజధానిగా చెయ్యాలని కొత్త వాదన తెరమీదకు వచ్చింది.