అందంతోపాటు భద్రత, 5అంతస్తుల్లో ఏపీ కొత్త అసెంబ్లీ: కోడెల శివప్రసాద్ ఏమన్నారంటే?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శాశ్వత భవనాన్ని ఐదు అంతస్తులలో నిర్మించనున్నట్టు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడించారు. శాశ్వత చట్ట సభల ఆకృతులపై నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో కోడెల శివప్రసాదరావు అసెంబ్లీ ఆవరణలో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నార్మన్ పోస్టర్ ప్రతినిధులతోపాటు అసెంబ్లీ, సీఆర్డీఏ అధికారులు, వాస్తు నిపుణులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, సిబ్బందికి కావాల్సిన వసతులపై వారితో చర్చించారు. పూర్తిస్థాయి ఆకృతులపై పలు మార్పులు సూచించారు. భేటీ అనంతరం కోడెల మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి అందం, ఆకర్షణే కాకుండా భద్రతాపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
ఐదు అంతస్తుల్లో అసెంబ్లీ నిర్మాణం జరుగనున్నట్లు వెల్లడించారు. సెల్లార్లో సర్వీసులు, మొదటి అంతస్తులో అసెంబ్లీ, కౌన్సిల్ హాల్, రెండో అంతస్తులో మంత్రుల లాంజ్లు, మూడో అంతస్తులో ప్రభుత్వ కార్యకలాపాలు కోసం నిర్మాణం జరగనున్నట్లు కోడెల శివప్రసాద్ వివరించారు.
అసెంబ్లీ జరగని సమయంలో పర్యాటకులకు అనుమతి ఉంటుందన్నారు. 250 మీటర్ల ఎత్తులో టవర్ వస్తుందని, లిఫ్ట్ల ద్వారా టవర్ పైకి వెళ్లి నగర అందాలు వీక్షించే అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఆగస్టు నెలాఖరుకు తుది ఆకృతులు సిద్ధమవుతాయన్నారు.