కొలువు తీరిన కేబినెట్ : భావోద్వేగాలు.. జగన్ ఆత్మీయ ఆలింగనాలు: ఆ ఇద్దరి అభిమానుల సందడి..!
ఏపీ సీఎం జగన్ డ్రీం కేబినెట్ కొలువు తీరింది. మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. సరిగ్గా 11.49 గంటలకు గవర్నర్ నరసింహన్ వారితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. శ్రీకాకుళం జిల్లా నుండి మొదలు పెట్టిన మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతపురం జిల్లా మంత్రితో ముగిసింది. పలువురు కొత్త మంత్రులు భావోద్వేగానికి గురయ్యారు. జగన్ ప్రతీ మంత్రిని ఆత్మీయ ఆలింగనంతో అభినందించారు. ఇద్దరు మంత్రులు ఆంగ్లం లో ప్రమాణ స్వీకారం చేయగా..మిగిలిన వారు తెలుగులోనే తమ ప్రమాణ స్వీకారాలు ముగించారు.
కొలువు తీరిన ఏపీ కేబినెట్...
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ..ఇప్పుడు మరో కీలక ఘట్టం పూర్తి చేసింది. సీఎం జగన్ కేబినెట్ 25 మంది మంత్రులతో కొలువు తీరింది. నిర్ణయించిన ముహూర్తం మేరకు సరిగ్గా 11.49 గంటలకు గవర్నర్ ప్రమాణ స్వీకార వేదిక వద్దకు చేరుకున్నారు. గవర్నర్ తో పాటుగా సీఎం జగన్ సైతం ఉన్నారు. తొలుత శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రుల నుండి ప్రమాణ స్వీకారం మొదలు పెట్టారు. ధర్మాన కృష్ణదాస్ తొలుత మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. ఆ తరువాత వరుసగా విజయనగరం, విశాఖ, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడప... చివరగా అనంతపురం నుండి శంకరనారాయణ ప్రమాణ స్వీకారంతో ఈ కీలక ఘట్టాన్ని ముగించారు.
ఇద్దరు ఆంగ్లంలో..అందరూ తెలుగులో.
ఈ సారి కేబినెట్లో మంత్రులుగా పని చేసిన అనుభవం ఉన్న వారు ఆరుగురే ఉన్నారు. మిగిలిన 19 మంది కొత్త వారే. అయితే, ఎవరూ కూడా ప్రమాణ స్వీకార సమయంలో ఎక్కడా తడబాటుకు గురి కాలేదు. అందూ స్పష్టంగా తన ప్రమాణ స్వీకార సందేశాన్ని చదవగలిగారు. అందరూ తెలుగులోనే ప్రమాణం చేయగా..ప్రకాశం జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్, నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి గౌతం రెడ్డి మాత్రం ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేసారు. ఇక, సురేష్, అనిల్, పేర్ని నాని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వారు ఉద్వేగానికి గురయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మంత్రులంగా జగన్ వద్దకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. జగన్ సైతం వారందరినీ ఆలింగనం చేసుకొని అభినందనలు తెలిపారు. గవర్నర్ సైతం మంత్రులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
కొడాలి నాని..అనిల్ ప్రమాణ స్వీకార సమయంలో..
మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా ..కృష్ణా జిల్లా నుండి కొడాలి నాని..పేర్ని నాని ప్రమాణ స్వీకార సమయంలో అభిమానులు పెద్ద ఎత్తున హర్ష ధ్వానాలు చేసారు. అదే విధంగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనూ అదే రకమైన సందడి కనిపించింది. నెల్లూరు నుండి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. బాలినేని శ్రీనివాస రెడ్డి...పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతు దారులు సైతం పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు. మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసిన తరువాత గవర్నర్..ముఖ్యమంత్రి కొత్త మంత్రులతో కలిసి గ్రూపు ఫొటోలు దిగారు.