సీఎంగా జగన్ శైలి ఎలా ఉంది: అధికారులతో కలిసి ఇంటి భోజనం: విమర్శలకు సమాధానంగా..!
Recommended Video
ప్రతిపక్ష నేత నుండి ముఖ్యమంత్రి అయిన జగన్ ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో అధికారులతో ఎలా వ్యవహరిస్తున్నారు. జనంతో నిత్యం మమేకం అయిన జగన్..అధికారులతో ఏ రకంగా ఉంటున్నారు..పాలనా పరమైన అంశాల్లో ఎటువంటి ప్రభావం చూపిస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. జగన్కు పాలనా అనుభవం లేదు. ఆయన అధికారంలోకి వస్తే పాలన ఏం చేస్తారనే దానికి ఇప్పుడు..జగన్ పనితీరు సమాధానం చెబుతుందని పార్టీ నేతలు అంటున్నారు. ఇంతకీ జగన్ తీరు ఎలా ఉంది...
జగన్ ముఖ్యమంత్రిగా..
ముఖ్యమంత్రిగా గత నెల 30న ప్రమాణ స్వీకారం చేసిన జగన్ అంతకు ముందు నుండే అధికారులతో సమీక్షలు ప్రారంభించారు. నాలుగు రోజులుగా అధికారిక హోదాలో రివ్యూలు నిర్వహిస్తున్నారు. అయితే,గతంలో ఎప్పుడూ జగన్ అధికారులతో టచ్ లేదు. ప్రతిపక్ష నేతగా..పులివెందుల ఎమ్మెల్యేగా ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడటం మినహా ఇటువంటి రివ్యూలు చేసిన అనుభవం లేదు. ఎన్నికల ప్రచారం సమయంలోనూ టీడీపీ నేతలు జగన్ ఒక్క ఛాన్స్ ఇవ్వమని కోరుతున్నారు..ఏం అనుభవం ఉంది..ఆయనకు పాలన గురించి ఏమైనా తెలుసా అంటూ ఎద్దేవా చేసారు. దీంతో..జగన్ ఇప్పుడు తన సామర్ధ్యం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి హోదాలో జగన్ సమీక్షలు చేస్తున్నారు. అధికారులు రివ్యూలు జరుగుతున్న తీరు పైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
అధికారులతో కలిసి ఇంటి భోజనం..
సమీక్షల్లో భాగంగా జగన్ తన తండ్రి విధానాన్ని అనుసరిస్తున్నారు. ఉదయం 10.30 గంటలకు అధికారిక రివ్యూలు ప్రారంభిస్తున్నారు. సమీక్షల్లో తన అనుమానాలను..సందేహాలను సూటిగా అడుగుతూ వాటికి పరిష్కారాలు ఏ విధంగా అయితే బాగుంటాయనే సమాధానాలు సైతం అధికారుల నుండే రాబడుతున్నారు. తనకు కావాల్సింది మాత్రం వారికి స్పష్టం చేసి..అమలు చేయాల్సిన బాధ్యత మీదే అంటూ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇక, ఖచ్చితంగా 1.30 గంటలకు లంచ్ కోసం విరామం ఇస్తున్నారు. ఆ సమయంలో తన వద్ద ఉన్న అధికారులకు అందరికీ తనతో పాటే ఇంటి భోజనంతో లంచ్ ఏర్పాటు చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి నివాసంలో సీఎం కోసం వండిందే అధికారులకు సైతం పెట్టమని జగన్ సూచించారు. దీంతో..అధికారులు ముఖ్యమంత్రితో కలిసి భోజనం చేయటం గురించి సాటి అధికారుల వద్ద చెప్పుకుంటున్నారు.
5.30 తరువాత ఉద్యోగులు ఉండవద్దు..
రాష్ట్ర ప్రభుత్వంలో పని చేసే ఉద్యోగులు ఉదయం 10.30 గంటలకు ఖచ్చితంగా సమయానికి కార్యాలయాలకు రావాలని..అదే విధంగా సాయంత్రం 5.30 తరువాత పని చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి హోదాలో జగన్ స్పష్టం చేసారు. అధికారులు సైతం ముఖ్యమైనవి తప్పితే రాత్రి 8 గంటల తరువాత విధులు కేటాయించవద్దని జగన్ తేల్చి చెప్పారు. దీంతో..ఈనెల 8వ తేదీ నుండి జగన్ సచివాలయం నుండే పాలన సాగించనున్నారు. దీని కోసం వాస్తు పరంగా..అధికారికంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.