ఉద్యమ ద్రోహీ దిగిపో....ఎపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబుకు చేదు అనుభవం
విజయవాడ:ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబుకు చేదు అనుభవం ఎదురైంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సిపిఎస్) రద్దు చేయాలంటూ ఫ్యాఫ్టో ఆధ్వర్యంలో ఉద్యోగులు విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్ లో ఆందోళన చేస్తున్నారు.
ఉద్యోగుల ధర్నా విషయం తెలిసి ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్బాబు కూడా అక్కడకు చేరుకున్నారు. తాము ఆహ్వానించకపోయినా హఠాత్తుగా ఎపిఎన్జీవో నేత అక్కడకు వచ్చేసరికి ఉద్యోగ సంఘాల నేతలు ముందు ఆశ్చర్యపోయినా, ఆ తర్వాత వేదిక పైకి ఆహ్వానించారు. ఆ విధంగా వేదిక మీదకు వచ్చిన అశోక్ బాబును చూడగానే ఉక్కసారిగా ఉద్యోగులు 'ఉద్యమ ద్రోహి అశోక్బాబు దిగిపోవాలి' అంటూ నినాదాలు ప్రారంభించారు. దీంతో అశోక్ బాబు షాక్ తిన్నారు...వివరాల్లోకి వెళితే...
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని (సీపీఎస్) రద్దుచేయాలంటూ విజయవాడలో ఫ్యాఫ్టో ఆద్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగులు శనివారం విజయవాడ జింఖానా గ్రౌండ్ లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఇందులో ఎక్కువమంది ఉపాధ్యాయులు కావడం గమనార్హం. ఉద్యోగుల ఆందోళన విషయం తెలిసి ఎపి ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు కూడా వారికి సంఘీభావం ప్రకటించేందుకు జింఖానా మైదానంకు చేరుకున్నారు.
తాము పిలవకున్నా రాష్ట్ర ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు నిరసన సభకు విచ్చేయడంతో ఫ్యాఫ్టో నేతలు ఆశ్చర్యపోయారు. ఆ తరువాత ఆయనను వేదికపైకి రావాల్సిందిగా కోరారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆ విధంగా వేదిక మీదకు ఎక్కిన అశోక్ బాబుకు ఆందోళన చేస్తున్న ఉద్యోగుల నుంచి అనూహ్యంగా తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో షాక్ తినాల్సివచ్చింది.
అశోక్బాబు వేదికపై కనిపించగానే వేదిక ఎదురుగా కూర్చున్న వేలాది మంది టీచర్లు, ఉద్యోగులు ఒక్కసారిగా లేచి చేతులు అడ్డంగా ఊపూతూ, 'ఉద్యమ ద్రోహి అశోక్బాబు దిగిపోవాలి'...అంటూ నినాదాలు ప్రారంభించారు. ఉద్యమాన్ని చీల్చే ఇలాంటి నేతలను పిలవొద్దంటూ...అశోక్ బాబు గో బ్యాక్ అంటూ ఆయన వెంటనే వేదిక దిగి వెళ్లి పోవాలని ఉద్యోగులు నినాదాలు కొనసాగించారు. దీంతో ఇక్కడ గందరగోళం నెలకొంది.
దీంతో ఉపాధ్యాయుల్ని శాంతింప చేసేందుకు ఫ్యాప్టో నేతలు తంటాలు పడినా ప్రయోజనం లేకపోయింది. ఊహించని పరిణామంతో ఖంగుతిన్న అశోక్ బాబు కొద్ది సేపటికి తేరుకొని ఉద్యోగులకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఫ్యాఫ్టో నేతలు జోక్యం చేసుకొని అశోక్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వద్దొంటూ ఉద్యోగులను సభాముఖంగా వేడుకున్నారు. దీంతో తమ యూనియన్ నేతలు బ్రతిమలాడుతుండటంతో కొద్ది సేపటికి ఉద్యోగులు నినాదాలు నిలిపివేశారు.