ఏపీ నో: అంతరాష్ట్ర రాకపోకలకు నో పర్మిట్, తప్పదంటే మాత్రం.. : డీజీపీ గౌతమ్ సవాంగ్
లాక్డౌన్ 5.0లో అంతరాష్ట్ర రాకపోకలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. ఎలాంటి అనుమతి/పర్మిట్ తీసుకోకుండా వెళ్లొచ్చని స్పష్టంచేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం రాకపోకలపై షరతులు కొనసాగుతాయని తెలిపింది. కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం కరోనా వైరస్ ప్రభావం తక్కువ ఉన్న రాష్ట్రాలు, ఎక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి వస్తోన్న ప్రయాణికులను విభజించి క్వారంటైన్కు తరలిస్తామని పేర్కొన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాకు తెలిపారు.
Recommended Video
జూన్ 30 వరకు తెలంగాణలో లాక్డౌన్: అంతర్రాష్ట్ర ప్రయాణాలపై నిషేధం ఎత్తివేత
కండీషన్స్ అప్లై..
రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే వరకు అంతరాష్ట్ర రాకపోకలపై కండీషన్స్ కొనసాగుతాయని డీజీపీ గౌతమ్ సవాంత్ తెలిపారు. ఒకవేళ తప్పదు అని అనుకుంటే స్పందన పోర్టల్ ద్వారా ఆప్లై చేసి.. ఈ పాస్ తీసుకోవాలని సూచించారు. వాస్తవానికి లాక్ డౌన్ 5.0 నిబంధనల్లో పాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
విధిగా పరీక్షలు
ఇతర రాష్ట్రాల నుంచి వస్తోన్న వారు తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా వైరస్ ప్రభావం తక్కువ ఉన్న రాష్ట్రాల నుంచి వస్తోన్న ప్రయాణికులు విధిగా హోం క్వారంటైన్లో ఉండాలని తెలిపారు. వైరస్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వస్తోన్న వారు ఏడురోజులు ఇన్స్టిట్యూషనరల్ క్వారంటైన్లో ఉండాలని పేర్కొన్నారు. పరీక్షలు చేసే సమయంలో నెగిటివ్ వస్తే ఏడు రోజులు హోం క్వారంటైన్ తప్పనిసరి అని పేర్కొన్నారు. పాజిటివ్ వస్తే కోవిడ్ ఆస్పత్రికి తరలిస్తామని తెలిపారు. దీనికి సంబంధించి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు షరతులు కొనసాగుతాయని స్పష్టంచేశారు.
తెలంగాణ ఓకే..
మరోవైపు తెలంగాణ రాష్ట్రం మాత్రం అంతరాష్ట్ర వాహనాలకు అనుమతిస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఆర్టీసీ బస్సులను ఎప్పటినుంచి నడిపిస్తామనే అంశంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ సమయంలో ఏపీ మాత్రం అంతరాష్ట్ర సర్వీసులకు ఆంక్షలు కొనసాగుతాయని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరగడం వల్లే నిర్ణయం తీసుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు.