నేను విన్నాను..ఉన్నాను అనే జగన్ నేను తిన్నాను అంటే బాగుండేది.. బడ్జెట్పై యనమల వ్యంగ్యాస్త్రాలు..!!
అమరావతి/హైదరాబాద్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం నాడు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ బడ్జెట్ను మంత్రి బొత్స సత్యానారాయణ ప్రవేశపెట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సోదరుడు సురేష్ హఠాన్మరణం చెందడంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేకపోయారు. దీంతో బొత్సా ఆ వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. నేటితో ఈ బడ్జెట్ పద్దులు ముగిశాయి. ఈ రెండు బడ్జెట్లు ప్రవేశపెట్టిన తర్వాత శాసనసభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. సోమవారం రోజున ఈ బడ్జెట్పై ప్రతిపక్షాలు మాట్లాడనున్నాయి. ప్రతిపక్షాల లేవనెత్తే విషయాలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు సంబంధిత మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా ప్రతిపక్ష పార్టీ నేతలు ఏపి ప్రభుత్వం ప్రేవేశ పెట్టిన బడ్జెట్ పై భగ్గుమంటున్నారు.
Recommended Video
బడ్జెట్ లోపభూయిష్టంగా ఉంది..!పెదవి విరుస్తున్న ప్రతిపక్ష నేతలు..!!
ఏపీ బడ్జెట్పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. బడ్జెట్లో ప్రచారం ఎక్కువ.. పస తక్కువని విమర్శించారు. సీఎం జగన్కు దశ ఉంది కానీ దిశ లేదని ఎద్దేవాచేశారు. 'బడ్జెట్లో నేనున్నాను.. నేను విన్నాను అని చెప్పే జగన్. నేను తిన్నాను అని కూడా చెప్పుకుంటే బాగుంటుంది. దాదాపు 48 వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చేందుకు సిద్ధమయ్యారు. వడ్డీలేని రుణాలపై హడావుడి చేసి 100 కోట్ల రూపాయలు పెట్టారు. జలవనరుల్లో వెయ్యి కోట్ల రూపాయలు తగ్గించారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు అంతంతమాత్రమే. ఏం ఉద్ధరించారని పథకాలకు వైఎస్ పేరు పెడుతున్నారు. ప్రజా పథకాలకు ఫ్యాక్షన్ కుటుంబం పేర్లు పెడతారా? కొన్ని పథకాలను రద్దు చేసి ప్రజలను రోడ్డున పడేస్తున్నారు' అని యనమల ఆరోపించారు.
85 శాతం జగన్ హామీలకు కేటాయింపులు: కాపు సంక్షేమానికి రెండు వేల కోట్లు: శాఖల వారీగా నిధులు ఇలా..!
అంకెల గారడి..! ప్రజలను భ్రమింపచేసే బడ్జెట్ అన్న ప్రతిపక్షం..!!
ఏపీ అసెంబ్లీలో నేడు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మొత్తం 2లక్షల 27 వేల 974 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ బడ్జెట్ కేటాయింపులు సరిగ్గాలేవని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ, బడ్జెట్లో ప్రచారం ఎక్కువ.. పస తక్కువ అని వ్యాఖ్యానించారు.
బడ్జెట్ ఆమోదయోగ్యంగా లేదు..!సున్నా వడ్డీకి నిధులు తక్కువ కేటాయింపులన్న టీడిపి..!!
తాజాగా... టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ స్పందించారు. బడ్జెట్ ప్రసంగం అనంతరం మాట్లాడిన అనురాధ.. బడ్జెట్ లోపభూయిష్టంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. ఇచ్చిన వాగ్ధానాలకు, బడ్జెట్కు పొంతన లేదన్నారు. సంక్షేమ పథకాలకు అరకొర నిధులు ఇచ్చారని.. సున్నా వడ్డీ పథకానికి కేవలం 100 కోట్ల రూపాయలే ఇచ్చారని విమర్శలు గుప్పించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఊసేలేదని.. బీమా పథకాన్ని లక్ష రూపాయలకు కుదించారని ప్రభుత్వంపై పంచుమర్తి అనురాధ ఎద్దేవా చేశారు.
అసెంబ్లీలో జగన్ భాషపై బీజేపీ నేత విమర్శలు..!పద్దతి మర్చుకోవాలని హితవు..!!
సీఎం జగన్పై బీజేపీ నేత మాణిక్యాలరావు విమర్శలు చేశారు. అసెంబ్లీలో గాడిదలంటూ జగన్ నీచమైన భాషను వాడటం సరికాదని ఆయన హితవు పలికారు. గ్రామ వాలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలను నియమించుకుంటున్నారని ఆరోపించారు. రేషన్ డీలర్లకు అన్యాయం చేస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబులా జగన్ కూడా కేంద్రాన్ని విమర్శిస్తున్నారని మాణిక్యాలరావు వ్యాఖ్యానించారు.