జగన్కు దారులన్నీ క్లోజ్, ఆర్టికల్ 243కే(2)కు సార్ధకత.. నిమ్మగడ్డ రమేశ్ ఇష్యూపై ప్రతిపక్షాలు..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తిరిగి నియమించాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. గవర్నర్ ఆదేశాలను విపక్షాలు స్వాగతించాయి. స్వపక్షంలో విపక్షంలా మారిన ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు కూడా స్పందించారు. ఎస్ఈసీగా నిమ్మగడ్డను కొనసాగించాలనే హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలనే గవర్నర్ ఆదేశాలను విపక్షాలన్నీ సానుకూలంగా స్పందించాయి.
స్వయం ప్రతిపత్తి కాపాడాలి: చంద్రబాబు
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను తిరిగి నియమించాలనే హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని గవర్నర్ ఆదేశాలను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్వాగతించారు. రాజ్యాంగబద్దమైన పదవీలో ఉన్న గవర్నర్ కోర్టుల ఔన్నత్యం నిలబెట్టడం సంతోషదాయకంగా అభివర్ణించారు. దీంతో ఆర్టికల్ 243కే(2)కు సార్ధకత ఏర్పడిందప్పారు. ఎస్ఈసీ తొలగింపు వెనుక ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం విధి నిర్వహణకు ఆటంకం కలిగించొద్దు, ఈసీ స్వయం ప్రతిపత్తిని కాపాడాలని చంద్రబాబు కోరారు.
శుభపరిణామం: సీపీఐ నారాయణ
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ను కొనసాగించాలని గవర్నర్ ఆదేశించడం శుభపరిణామమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఎస్ఈసీ విషయంలో సీఎం జగన్ తీరు సరికాదని, ఇప్పటికైనా విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. లేదంటే రాష్ట్రం రాజ్యాంగ సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. రాజ్యాంగ పరంగా సీఎం జగన్కు అన్ని దారులు మూసుకుపోయాయని చెప్పారు. రాజకీయాల్లో పట్టువిడుపులు అవసరమని, మొండిగా ముందుకెళ్లడం మంచిది కాదని హితవు పలికారు.
ఆర్డినెన్స్ జారీ రాజ్యాంగవిరుద్ధం: యనమల
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేశ్ ను కొనసాగించాలని గవర్నర్ ఆదేశించడం సంతోషకరమని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఏపీ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసిందని విమర్శించారు. గవర్నర్ ఆదేశాలతో సీఎం జగన్ న్యాయ విభాగానికి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయిందని చెప్పారు. గవర్నర్ ఆదేశాల తర్వాత కూడా నిమ్మగడ్డకు అడ్డంకులు సృష్టించాలని అనుకొంటే మాత్రం, రాష్ట్రం రాజ్యాంగ సంక్షోభం ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు.
Recommended Video
రఘురామ హర్షం
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ స్పందనపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు హర్షం వ్యక్తం చేశారు. ఎస్ఈసీగా రమేశ్ కుమార్ను కొనసాగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ దిశానిర్దేశం చేయడం శుభపరిణామం అన్నారు. హైకోర్టు తీర్పు మేరకు తనను ఎస్ఈసీగా కొనసాగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ గవర్నర్కు విజ్ఞప్తి చేయడంతో ఈ మేరకు గవర్నర్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. దీంతో విపక్షాలు స్పందించాయి.