కేసేదైనా ఒకటే... ఇంప్లీడ్ అయ్యామా లేదా ? జగన్ వ్యతిరేకతే లక్ష్యంగా విపక్షాల పావులు...
ఆంధ్రప్రదేశ్ లో గతేడాది భారీ మెజారిటీతో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు హైకోర్టులో దాదాపు ప్రతీ రోజూ ఏదో ఒక కేసును ఎదుర్కొంటోంది. దీనికి కారణం దాదాపు ప్రతీ కేసులోనూ విపక్షాలు పిటిషన్లలు వేయడమో లేక అప్పటికే దాఖలైన పిటిషన్లలో ఇంప్లీడ్ అవుతుండటమే. తాజా పరిణామాలు చూస్తుంటే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాక్షేత్రంలో పోరాడలేమని విపక్షాలు ఓ అంచనాకు వచ్చేశాయా అన్న వాదన వినిపిస్తోంది.
నవ్వులపాలైన తెలుగువారు! బీహార్ ఆఫ్ సౌత్: జగన్ ఏడాది పాలనపై చంద్రబాబు రిపోర్ట్
జగన్ పై న్యాయపోరాటం...
ఏపీలో గతేడాది వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత తీసుకున్న పలు నిర్ణయాలపై కమ్యూనిస్టులు మినహా మిగతా విపక్షాలన్నీ ఏదో ఒక సందర్భంలో హైకోర్టును ఆశ్రయించాయి. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించడం, పిటిషన్లు వేయడం లేదా అప్పటికే దాఖలైన పిటిషన్లలో ఇంప్లీడ్ కావడం అన్నది వాస్తవానికి పెద్ద విశేషమేమీ కాదు. అంతకు మించి వారికున్న రాజ్యాంగపరమైన హక్కు కూడా. కానీ జగన్ సర్కారుకు వ్యతిరేకంగా దాఖలయ్యే దాదాపు ప్రతీ కేసులోనూ విపక్షాల ఉనికి కనిపిస్తుండటం ఇప్పుడు కొత్త వాదనలకు, చర్చకు తావిస్తోంది.
ప్రజావేదిక కూల్చివేత నుంచి నిమ్మగడ్డ వరకూ....
జగన్ సర్కారు అధికారంలోకి రాగానే చేపట్టిన ఉండవల్లిలోని ప్రజావేదిక కూల్చివేతకు వ్యతిరేకంగా అర్ధరాత్రి దాఖలైన పిటిషన్ ను హైకోర్టు బెంచ్ తెల్లవారు జాము వరకూ విచారించి తీర్పు వెలువరించింది. ఈ కేసులో టీడీపీ అనుకూల న్యాయవాది అర్ధరాత్రి పిటిషన్ వేసినా అనుకున్న ఫలితాన్ని మాత్రం రాబట్టుకోలేకపోయారు. అప్పటి నుంచి పీపీఏలైనా, ఇంగ్లీష్ మీడియం అయినా రాజధాని అయినా, నిమ్మగడ్డ అయినా విపక్షాలు లేదా వారి తరఫు న్యాయవాదులు ప్రతీ కేసులోనూ ఏదో రకంగా భాగస్వాములవుతూ వస్తున్నారు. వాస్తవానికి ఇవన్నీ ఒకదానితో ఒకటి పరస్పరం సంబంధం లేని కేసులే. అలాగని ఇవన్నీ ప్రజావ్యతిరేక నిర్ణయాలా, ఇందులో ప్రజా ప్రయోజనం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్ధితి.
విధానాలతో సంబంధం లేకుండా...
ఈ దేశంలో ఒక్కో పార్టీకీ ఒక్కో సిద్ధాంతం, పార్టీ విధానం ఉంటుంది. కానీ విపక్షాలు దాఖలు చేస్తున్న కేసులను నిశితంగా పరిశీలిస్తే ఎక్కడా పార్టీ విధానానికీ కానీ, చాలా సందర్భాల్లో ప్రజా ప్రయోజనానికి కానీ సంబంధం లేకుండా కేసులు దాఖలవుతున్న తీరును గమనించవచ్చు. ఇంకొన్ని సందర్భాల్లో పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్న తీరు కూడా ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఉదాహరణకు గతంలో ఇంగ్లీష్ మీడియాన్ని పాక్షికంగా అమలు చేసిన టీడీపీ... వైసీపీ తీసుకున్న ఇంగ్లీష్ మీడియం అనుకూల విధానానికి వ్యతిరేకంగా బీజేపీతో కలిసి హైకోర్టులో పోరాటాలు చేసింది.
జగన్ ను ఎదుర్కోలేమని ఫిక్సయ్యారా ?
రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేల బలంతో సుస్దిరంగా కనిపిస్తున్న వైసీపీ సర్కారును, పార్టీకీ, ప్రభుత్వానికీ అధినేతగా ఉన్న వైఎస్ జగన్ ను విధానపరంగా, ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేమనే అంచనాకు విపక్షాలు వచ్చేశాయా అన్న అనుమానాలు తాజాగా కలుగుతున్నాయి. దీనికి కారణం గతంలో ఇసుకతో పాటు పలు సమస్యలపై ప్రజా పోరాటాలకు తెరలేపిన విపక్షాలు... కొన్ని నెలలుగా వాటికి బదులుగా న్యాయపోరాటానికే మొగ్గు చూపుతున్నాయి. ఉదాహరణకు రాజధాని తరలింపుపై జనంలోకి వెళ్లి తమ విధానం చెప్పుకునే బదులు న్యాయపోరాటం ద్వారా ప్రభుత్వ ఆదేశాలను అడ్డుకోవడమే లక్ష్యంగా విపక్షాలు కేసులు దాఖలు చేయడం విచిత్రంగా కనిపిస్తోంది.
Recommended Video
ప్రతిష్ట, ప్రయోజనాలే పరమావధి...
విపక్షాలు హైకోర్టు, సుప్రీంకోర్టులో దాఖలు చేస్తున్న పలు కేసులను గమనిస్తే... వాటిలో వైసీపీ జోరుతో తమ పార్టీ ముద్ర ఎక్కడ కనుమరుగు అవుతుందోనన్న భయం కనిపిస్తోంది. ఉదాహరణకు వైసీపీ రంగుల వ్యవహారాన్ని తీసుకుంటే వీటి వల్ల ప్రభుత్వానికి, అలాగే విపక్షానికీ ఎలాంటి ప్రయోజనం కానీ, నష్టం కానీ లేవు. కానీ వైసీపీ రంగులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విపక్షాలు వాటిపై న్యాయపోరాటం చేస్తున్నాయి. అలాగే ఇంగ్లీష్ మీడియం, నిమ్మగడ్డ వ్యవహారాలను గమనించినా ఇదే కనిపిస్తుంది. గతంలో పీపీఏల సమీక్ష వల్ల ప్రజలకు ప్రయోజనం ఉంటుందని తెలిసినా వాటిపై కోర్టుల్లో పోరాటానికి తెరదీయడం వెనుక వ్యక్తుల ప్రయోజనాలే ఉన్నాయనేది బహిరంగ రహస్యమే.