ఏపీ పంచాయతీ రంగుల తొలగింపుపై హైకోర్టులో విచారణ, 3 నెలల సమయం కోరిన సర్కార్, నో..
పంచాయతీ భవనాలకు వేసిన రంగుల తొలగింపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురైంది. రంగులు తొలగించేందుకు తమకు మరింత సమయం కావాలన్న ఏపీ ప్రభుత్వ వాదనను హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ కేసులో గురువారం ప్రభుత్వం తరఫున వాదనలను హైకోర్టు ధర్మాసనం అలకించింది.
పంచాయతీ భవనాలకు వేసిన పార్టీ రంగులు తొలగించే పిటిషన్ను గురువారం హైకోర్టు ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. రంగులు తొలగించేందుకు తమకు సమయం కావాలని ప్రభుత్వం వాదనలు వినిపించింది. కనీసం మూడు నెలల సమయం కావాలని కోరగా.. అందుకు ధర్మాసనం నిరాకరించింది.
కొత్త రంగులు వేసేందుకు ఎంత సమయం పడుతుందో అధ్యయనం చేయాలని ప్రభుత్వం తరఫున న్యాయవాది తెలిపారు. సోమవారం రోజున చెబతామని పేర్కొన్నారు. కానీ అతని వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. వీలైనంత త్వరగా పార్టీ రంగు తొలగించాలని పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. తదుపరి విచారణ సమయానికి పూర్తి వివరాలతో రావాలని కోరింది. రంగులు వేసే సమయాన్ని ఖచ్చితత్వంతో తెలియజేయాలని స్పష్టంచేసింది.