నిమ్మగడ్డ మార్కు: 2,386 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ,2,245 వార్డు మెంబర్లవి కూడా
ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్, జగన్ సర్కారుకు మధ్య వివాదాలు కొనసాగుతున్నప్పటికీ, ప్రక్రియ మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరిగిపోతోంది. ఏకగ్రీవాల విషయంలో నిక్కచ్చిగా ఉంటామని ఎస్ఈసీ చెప్పడంతో తొలి దశ పంచాయితీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే, తొలి దశలో నామినేషన్ల తిరస్కరణ కూడా అంతే స్థాయిలో ఉండటం గమనార్హం. వివరాల్లోకి వెళితే..
నిమ్మగడ్డపై చర్యలు -అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ భేటీలో రచ్చ -కీలక నిర్ణయం -జగన్ వెనక్కి తగ్గారా?
లక్షకు చేరువగా నామినేషన్లు..
మొత్తం నాలుగు విడతల్లో పంచాయితీ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇవ్వగా.. విజయనగరం జిల్లా మినహా మిగిలిన 12 జిల్లాల్లో మొదటి విడతలో 3,249 సర్పంచ్ స్థానాలు, 32,504 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. సర్పంచ్ పదవులకు మొత్తం 18, 168 మంది, వార్డు పదవులకు మొత్తం 77,554 నామినేషన్లు వచ్చాయి. రెండూ కలిపితే.. తొలి దశకు 95, 722 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) కార్యక్రమం సోమవారం జరగ్గా..
భారీగా నామినేషన్ల తిరస్కృతి
తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన నేడు ముగిసింది. ఈ నేపథ్యంలో, అనర్హతకు గురైన నామినేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. సర్పంచ్, వార్డు అభ్యర్థులకు సంబంధించి భారీగా నామినేషన్లు తిరస్కరించారు. సర్పంచ్ పదవి కోసం మొత్తం 18, 168 నామినేషన్లు రాగా, వాటిలో 2,386 నామినేషన్ పత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. అదే సమయంలో వార్డు పదవుల కోసం 77,554 నామినేషన్లు రాగా, అందులో 2,245 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని ఎస్ఈసీ పేర్కొంది. ఇక..
కర్నూలులో కొత్త పంచాయితీ
తొలి దశలో తిరస్కరణకు గురైన నామినేషన్ల వివరాలను జిల్లాల వారీగానూ వెల్లడించారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే అత్యధికంగా 1,125 నామినేషన్లు తిరస్కరించారు. ఈ జిల్లాలో తొలి దశలో 193 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా, మొత్తం 1,243 నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో ఏకంగా 1125 తిరస్కరణకు గురికాగా, కేవలం 118 నామినేషన్లే అర్హత పొందాయి. సర్పంచ్ స్థానాల కంటే, దాఖలైన నామినేషన్ల సంఖ్య తక్కువగా ఉండటంతో దీనిపై ఎస్ఈసీ తదుపరి నిర్ణయం తీసుకోనుంది. ఇక చిత్తూరు జిల్లాలో 349 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరిచంగా, విశాఖలో 152, తూర్పు గోదావరి 141, ప్రకాశం 138, అనంతపురం 112, గుంటూరు 84, కృష్ణా 76, శ్రీకాకుళం 62, కడప 54, పశ్చిమ గోదావరి 52, నెల్లూరు జిల్లాలో 41 నామినేషన్లు తిరస్కరించారు. అయితే..
తొలి దశ అభ్యర్థులపై 4న క్లారిటీ
పంచాయితీ ఎన్నికల తొలి దశలో 2,386 సర్పంచ్ అభ్యర్థుల, 2,245 వార్డు మెంబర్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, ఎస్ఈసీ నిర్ణయంపై అభ్యంతరాలను వ్యక్తం చేసేందుకు అభ్యర్థులకు ఇవాళ సాయంత్రం 5గంటల వరకు గడువిచ్చారు. వాటిపై బుధవారం (3న) ఎస్ఈసీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 4వ తేదీ మ.3 గంటల వరకు అవకాశం కల్పిస్తారు. దాంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎందరనేదానిపై క్లారిటీ వస్తుంది. ఆ వెంటనే ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల వివరాలతోపాటు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ఎక్కడికక్కడ సంబంధిత రిటర్నింగ్ అధికారులు ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువమంది అభ్యర్థులు పోటీలో ఉన్నచోట ఫిబ్రవరి 9న ఉ.6.30 నుంచి మ.3.30 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సా.4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు.
జగన్ వల్ల జనంలో సోమరితనం -దాన్ని మోదీ సహించరు -అందుకే కేంద్ర బడ్జెట్లో ఏపీకి సున్నా: వైసీపీ ఎంపీ