ఏపీలో ప్రారంభమైన రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్...
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడత పోలింగ్ శనివారం(ఫిబ్రవరి 13) ఉదయం ఆరున్నర గంటలకు ప్రారంభమైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాలు మినహా మిగతా చోట్ల మధ్యాహ్నం 3.30 వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30గంటల వరకే పోలింగ్ జరగనుంది. 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.
రెండో దశలో మొత్తం 3,328 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్లు జారీ చేయగా 539 చోట్ల సర్పంచి పదవులు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మిగిలిన 2,786 చోట్ల సర్పంచి పదవులకు నేడు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో మొత్తం 7,507 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఉన్న 167 మండలాల పరిధిలోని గ్రామాల్లో పోలింగ్ జరగనుంది.
రెండో విడత పోలింగ్ జరగనున్న గ్రామాల్లో మొత్తం 33,570 వార్డులుండగా 12,604 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 149 వార్డులలో నామినేషన్లు దాఖలవలేదు.దీంతో మిగిలిన 20,817 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఈ వార్డుల్లో 44,876 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.
రెండో దశ ఎన్నికలకు 29,304 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 5,480 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు.మరో 4,181 పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాత్మకంగా గుర్తించారు. ఎన్నికల విధుల్లో 47,492 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పోలింగ్, లెక్కింపు కేంద్రాల దగ్గర పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
ఎన్నికల విధుల్లో 1292 స్టేజ్ - 1 రిటర్నింగ్ అధికారులు, 3427స్టేజ్ -2 రిటర్నింగ్ అధికారులు, 1370 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను నియమించారు. 33835 మంది ప్రిసైడింగ్ అదికారులు, ఇతర పోలింగ్ సిబ్బందితో కలిపి మొత్తం 47,492మంది ఎన్నికల విధుల్లో ఉన్నారు. కౌంటింగ్ కోసం 32, 141మంది సిబ్బంది ఉండగా, జిల్లాకి ఒకరు చొప్పున 13 మంది పంచాయితీ రాజ్ ఉన్నతాధికారులను కౌంటింగ్ అబ్జర్వర్లుగా నియమించారు. ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్, డీజీపీ కార్యాలయాల్లో స్పెషల్ కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎస్ఈసీ పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తారు.