ఎన్నికల పంచాయతీ తేలేది ఎల్లుండే: జగన్ సర్కార్ ఆశలు ఆ పిటీషన్ మీదే: అదే హాట్ టాపిక్
అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేడి మళ్లీ రాజుకుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం తాజాగా ఇచ్చిన ఆదేశాలు, చేసిన వ్యాఖ్యలతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు ఆరంభం కాబోతోన్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇదివరకు జారీ చేసిన నోటిఫికేషన్ను రీషెడ్యూల్ చేశారు. ఫలితంగా నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి సమయం చిక్కినట్టయింది. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహా అన్ని రాజకీయ పక్షాలు ఇక ఎన్నికల ప్రక్రియపై దృష్టిని కేంద్రీకరించాయి.
Recommended Video
దెబ్బకు దెబ్బ: అమరావతి ఖాళీ: హైకోర్టు షిఫ్ట్: కేంద్రంపై ఒత్తిడి: పార్లమెంట్లో వ్యూహం
ఏపీ హైకోర్టులో ఎల్లుండి విచారణ..
ఈ పరిస్థితుల మధ్య ఏపీ హైకోర్టులో మరో పిటీషన్ బుధవారం విచారణకు రాబోతోంది. కొత్త ఓటర్లకు అవకాశం కల్పించనందున.. పంచాయతీ ఎన్నికల నిర్వహణను నిలిపివేయాలని కోరుతూ గుంటూరుకు చెందిన ధూలిపాళ్ల అఖిల అనే విద్యార్థిని దాఖలు చేసిన పిటీషన్ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. విచారణకు స్వీకరించిన వెంటనే.. బుధవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో.. ధూలిపాళ్ల అఖిల పిటీషన్.. ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది.
మాకెందుకు అవకాశం ఇవ్వరు..
రాష్ట్రంలో సవరించిన జాబితా ప్రకారం.. పంచాయతీ ఎన్నికలను నిర్వహించట్లేదంటూ శనివారం నాటి విలేకరుల సమావేశంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ప్రకటన ఆధారంగా ఆ విద్యార్థిని.. ఈ హౌస్ మోషన్ పిటీషన్ను దాఖలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన ప్రకటనలను చూస్తే.. రాష్ట్రంలో మూడున్నర లక్షలమందికి పైగా కొత్త ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త జాబితా ప్రకారం పంచాయతీ ఎన్నికలను నిర్వహించేలా ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని ఆదేశించాలని ధూలిపాళ్ల అఖిల హైకోర్టుకు విజ్ఙప్తి చేశారు.
ఎన్నికల్లో పోటీ కూడా చేయలేం..
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వేలాదిమంది యువతీ, యువకులు ఆసక్తిగా ఉన్నారని, అలాంటి వారి పేర్లను కనీసం ఓటర్ల జాబితాలో లేకుండా చేయడం సరికాదని తాను అభిప్రాయపడుతున్నాననే విషయాన్ని అఖిల తన పిటీషన్లో పేర్కొన్నారు. ఓటు హక్కు ఉన్నప్పటికీ.. దాన్ని సవరించిన జాబితా ప్రకారం కాకుండా.. 2019 నాటి ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం వల్ల లక్షలాది మంది యువ ఓటర్లు ఓటు వేసే హక్కును కోల్పోతారని అన్నారు. కాగా-ఓటర్ల జాబితా సవరణ అనేది నిరంతర ప్రక్రియ అని, దాని వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలు వాయిదా కోరడంపై ఆగ్రహం..
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో జగన్ సర్కార్కు ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. విచారణ చేపట్టిన కొన్ని నిమిషాల్లోనే దాన్ని కొట్టేసింది. ఎన్నికలను వాయిదా వేయడం కుదరదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు తమ విధుల్లో పాల్గొనకుండా ఇలా పిటిషన్లను దాఖలు చేయడం ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.