హౌజ్ అరెస్టు: నిమ్మగడ్డకు హైకోర్టు ఝలక్ -రాష్ట్రపతి పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి -‘ప్రివిలేజ్’ ప్రతీకారం
ఆంధ్రప్రదేశ్లో పంచాయితీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్, జగన్ సర్కారుకు మధ్య కొనసాగుతోన్న వివాదాలు తారా స్థాయికి చేరాయి. ఎన్నికల ప్రక్రియకు విఘాతంగా మారాడంటూ ఏకంగా పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్టు చేయించారు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమారు. అయితే, ఎన్నికలు ముగిసేదాకా, అంటే ఈనెల 21 దాకా పెద్దిరెడ్డిని హౌజ్ అరెస్టులో ఉంచాలన్న ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు అత్యవసరంగా విచారిస్తోంది. తుది తీర్పు కంటే ముందుగానే మంత్రి పెద్దిరెడ్డికి ఊరట కలిగిస్తూ.. ఆదివారంనాటి రాష్ట్రపతి పర్యటనలో ఆయన పాల్గొనేందుకు కోర్టు అనుమతించింది..
అడ్డంగా దొరికిన నిమ్మగడ్డ -టీడీపీ ఆఫీసులోనే యాప్ -అందుకే కోడ్ చెప్పట్లేదు: వైసీపీ సంచలన ఆరోపణ
చిత్తూరుకు రాష్ట్రపతి రాకతో..
భారత రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఒకరోజు పర్యటన కోసం ఆదివారం చిత్తూరు జిల్లా విచ్చేయనున్న సందర్భంగా ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు స్వాగతం పలికి, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకుగానూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పటికే జిల్లాకు చేరుకున్నారు. రాష్ట్రపతి తొలుత మదనపల్లెలోని సుప్రసిద్ధ తత్వవేత్త ముంతాజ్ అలీకి చెందిన సత్సంగ్ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ఆశ్రమ నిర్మాణాలు, స్వస్థ్య ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తారు. అక్కడే భారత్ యోగా విద్యా కేంద్రకు సంబంధించిన యోగా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. సుమారు మూడు గంటలపాటు రాష్ట్రపతి అక్కడే గడుపుతారు. అనంతరం సదుం మండలంలో ముంతాజ్ అలీ నిర్వహిస్తున్న పీపల్ గ్రో పాఠశాలకు చేరుకుంటారు. అక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.50 గంటలకు అక్కడ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి తిరిగి బెంగుళూరు వెళతారు. ఈ కార్యక్రమాల్లో కొన్నింటికి స్థానిక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పాల్గొనాల్సి ఉండగా, ఎస్ఈసీ విధించిన హౌజ్ అరెస్టు కారణంగా సందిగ్ధత ఏర్పడింది. దీంతో మంత్రి హైకోర్టును ఆశ్రయించగా..
మంత్రికి ఊరట.. తుది తీర్పు ఇవాళే..
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హౌజ్ అరెస్టు వివాదంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు ఝలక్ తగిలినట్లయింది. ఈనెల 21 వరకు మంత్రిని ఇల్లు కదలనీయొద్దన్న ఎస్ఈసీ ఆదేశాలకు విరుద్ధంగా.. రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఎస్ఈసీ ఆదేశాలను సవాలు చేస్తూ మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు అప్పటికప్పుడే మంత్రికి అనుకూలంగా ఉత్తర్వులిచ్చింది. ఆయన రాష్ట్రపతి పర్యటనలో నిరభ్యంతరంగా పాల్గొనవచ్చన్న జడ్జిలు.. హౌజ్ అరెస్టు వివాదంపై తుది తీర్పును కూడా ఇవాళే వెలువరిస్తానని చెప్పారు. అంటే ఇంకాసేపట్లో..
ప్రవిలేజ్ నోటీసులకు ప్రతీకారం..
హౌజ్ అరెస్టు వివాదంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో సంచలన విషయాలు పేర్కొన్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ ఉద్దేశపూర్వకంగానే ప్రతీకారచర్యలకు దిగుతున్నారని మంత్రి ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో నిమ్మగడ్డ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని, గత నెల 28న గవర్నర్కు లేఖ రాసిన నిమ్మగడ్డ అందులో తన(పెద్దిరెడ్డి)పై పలు తప్పుడు ఆరోపణలు చేశారని, ఆ వ్యాఖ్యలపై తాను అసెంబ్లీ స్పీకర్కు లేఖ రాసి, సభా హక్కుల ఉల్లంఘన కింద నిమ్మగడ్డపై చర్యలు తీసుకోవాలని కోరానని, అందుకే ఎస్ఈసీ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని మంత్రి ఆరోపించారు. అంతేకాదు.. తన హౌజ్ అరెస్టుకు దారితీసిన ప్రెస్ మీట్ (ఈనెల 5న తిరుపతిలో చేసిన కామెంట్ల)ను ఎస్ఈసీ నిమ్మగడ్డ వక్రీకరించారని, హౌజ్ అరెస్టు ఉత్తర్వులు జారీ చేసే ముందు నోటీసులు ఇవ్వకపోగా, కనీసం వివరణ కూడా కోరలేదని, ఎస్ఈసీ ఇలా వ్యవహరించడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని మంత్రి పెద్దిరెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే..
పెద్దిరెడ్డి మీదుగా ఏకగ్రీవాలపై తూటా..
ప్రభుత్వంలో ఉన్నత పదవులు, విస్తృతాధికారాలు కలిగిన పంచాయతీరాజ్ శాఖ మంత్రి బలవంతపు ఏకగ్రీవాలకు పిలుపివ్వడం... స్వేచ్ఛ, నిష్పాక్షిక ఎన్నికలకు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని, స్థానిక నాయకత్వాన్ని బలపరిచేందుకు తెచ్చిన 73వ రాజ్యాంగ సవరణ ఫలాలకు మంత్రి వ్యాఖ్యలు విఘాతకరమని, అందుకే రాష్ట్రంలో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కే ప్రకారం ఈమేరకు మంత్రి పెద్దిరెడ్డిని ఈనెల 21 వరకు హౌజ్ అరెస్టులో ఉంచాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు రాసిన లేఖలో ఎస్ఈసీ నిమ్మగడ్డ పేర్కొన్నారు. హౌజ్ అరెస్టు సమయంలో మంత్రి.. వైద్య పరీక్షలకు వెళ్లొచ్చని, అంతేగానీ, మీడియాతోగాని, తన అనుచరులు, మద్దతుదారులతో మాట్లాడకూడదని ఎస్ఈసీ నిర్దేశించారు. కాగా, పెద్దిరెడ్డి తన మంత్రి విధులను, ఆఫీసు కార్యక్రమాలను యథావిధిగా ఇంటి నుంచి నిర్వహించుకోవచ్చని, ప్రజాభీష్టం మేరకే మంత్రిపై ఈ నిబంధనలు విధించామని నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఏపీలో పంచాయితీ ఎన్నికల పరిణామాలను నిశితంగా పరిశీలించాలంటూ కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాసిన లేఖలోనూ నిమ్మగడ్డ ఇలాంటివే కీలక అంశాలను పేర్కొన్నారు. కాగా,
నిమ్మగడ్డకు జైలు తప్పదు..
చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో పంచాయితీల ఏకగ్రీవ ఎన్నికలను ఆపాలని, అభ్యర్థులు గెలిచినట్లుగా డిక్లరేషన ఇవ్వొద్దని ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశించిన దరిమిలా, ఎకగ్రీవాల డిక్లరేషన్లు ఇవ్వని అధికారులపై (ఎన్నికల తర్వాతైనా) చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలను గర్హించిన ఎస్ఈసీ.. పంచాయితీ పోరు ముగిసేదాకా మంత్రిని గృహ నిర్బందంలో ఉంచాలని ఆదేశించారు. హౌజ్ అరెస్టు ఆదేశాలు వెలువడిన తర్వాత కూడా ఎస్ఈసీ నిమ్మగడ్డను ఉద్దేశించి మంత్రి పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డకు పిచ్చి ముదిరిందని, ఆయనను అసెబ్లీలో దోషిగా నిలబెడతామని, కనీసం మూడేళ్లు జైలుకు పంపుతామని మంత్రి సవాలు చేశారు. ఈ వివాదంపై ఏపీ హైకోర్టు ఆదివారమే తీర్పు ఇస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది..
విశాఖలో ఉక్కు బాంబు: చంద్రబాబు అనూహ్య స్కెచ్ -ఒకే దెబ్బకు వైసీపీ-బీజేపీ దిమ్మతిరిగేలా..