నిమ్మగడ్డ వాళ్లకు మాత్రమే సొంతం: వదిలేస్తే బెటర్: అప్పుడే ఆయనపై విశ్వసనీయత: మాజీ సీఎస్
అమరావతి: రాష్ట్రంలో ఎట్టకేలకు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు తొలి అడుగు పడబోతోంది. ఎన్నికలను నిర్వహించి తీరాల్సిందేనంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. దీనికి సంబంధించిన ప్రక్రియ ఆరంభమైంది. ఇదివరకే జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. నామినేషన్లను దాఖలు చేయడానికి సమయం లేకపోవడం వల్లే ఎన్నికల షెడ్యూల్లో మార్పలు చేయాల్సి వచ్చింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు ఈ క్షేత్రస్థాయి ఎన్నికలపై దృష్టి సారించాయి. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొంటోంది.
Recommended Video
కట్టప్ప కంటే కరడుగట్టిన బానిసగా నిమ్మగడ్డ: సాయిరెడ్డి ఫైర్: డెమోక్రసీ అంటే 'మన' స్వామ్యమా
పంచాయతీ ఎన్నికలను నిమ్మగడ్డ రమేష్ కుమార్ సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించగలరా? లేదా? అనే అనుమానాలను వైఎస్సార్సీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశానికి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లో నడుచుకుంటున్నారంటూ వైఎస్సార్సీపీ నాయకులు ఇప్పటికే బహిరంగంగా వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యకర్తగా ఆయన వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. దీనిపై రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నాయకుడు ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యవహారం న్యాయస్థానాల మెట్లెక్కాల్సిన పరిస్థితులు ఏర్పడటానికి దారి తీసిన పరిస్థితులు, కారణాలను ఆయన విశ్లేషించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుందని, అందువల్లే ఆయన పనితీరుపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయని పేర్కొన్నారు. విశ్వసనీయతపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. టీడీపీకి తోడు ఒక వర్గానికి చెందిన మీడియా కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తమవాడిగా చూస్తోందని చెప్పారు. ఇది అనవసరమని వ్యాఖ్యానించారు.
ఫోటోలు: గణతంత్ర దినోత్సవం రోజున ఉద్రిక్తంగా మారిన కిసాన్ ర్యాలీ
టీడీపీ, ఒక వర్గానికి చెందిన మీడియా ఆయన విధి నిర్వహణను ఆయనకు వదిలేయడం మంచిదని చెప్పారు. అలాంటిప్పుడే నిమ్మగడ్డ మరింత విశ్వసనీయతతో పని చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థాయిలో ఉన్న అధికారి పట్ల తెలుగుదేశం వంటి బలమైన రాజకీయ పార్టీ ముద్రపడటం సరికాదనే అభిప్రాయాన్ని ఆయన పరోక్షంగా వ్యక్తీకరించారు. ఆ స్థాయిలో ఉన్న అధికారి.. నిష్పక్షపాతంగా వ్యవహరించగలరనే గుర్తింపు పొందాల్సిన అవసరం ఉందని ఐవైఆర్ కృష్ణారావు పేర్కొన్నారు.