నిమ్మగడ్డ ఆగ్రహానికి గురైన ఆ ఇద్దరు ఐఎఎస్ అధికారులకు కొత్త పోస్టింగులు: కీలక స్థానాల్లో
అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణను సమర్థవంతంగా నిర్వర్తించట్లేదనే కారణంతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాల మేరకు బదిలీ చేసిన ఇద్దరు ఐఎఎస్ అధికారులకు జగన్ సర్కార్ కొత్తగా పోస్టింగ్ ఇచ్చింది. కీలక స్థానాల్లో వారిని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. వారితో పాటు విధుల నుంచి తప్పించిన తిరుపతి అర్బన్ పోలీస్ సూపరింటెండెంట్ ఆవుల రమేష్ రెడ్డికి ఇంకా పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా ముగ్గురు ఐఎఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.
నారాయణ్ భరత్ గుప్తాను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. గ్రామ/వార్డు వలంటీర్లు, గ్రామ/వార్డు సచివాలయాల డైరెక్టర్గా పూర్తిస్థాయి అదనపు బాధ్యత (ఎఫ్ఏసీ)లను అప్పగించింది. ఇప్పటిదాకా ఈ స్థానంలో కొనసాగిన నవీన్ కుమార్ జీఎస్ను బదిలీ చేసింది. గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్గా నియమించింది. గుంటూరు జిల్లా కలెక్టర్ ఐ శామ్యుల్ ఆనంద్ కుమార్ను రాష్ట్ర ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది.
Recommended Video
ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కే సునీత ఈ స్థానంలో పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి ప్రత్యేక కార్యదర్శిగా శామ్యుల్ ఆనంద్ కుమార్కు అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. శామ్యుల్ ఆనంద్ కుమార్ను పంచాయతీ శాఖతోనే అనుసంధానం చేయడం ప్రాధాన్యతను సంతరించరుకుంది. నారాయణ్ భరత్ గుప్తా, శామ్యుల్ ఆనంద్ కుమార్లతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగ్రహానికి గురైన ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డికి ఇంకా పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.