పంచాయతీ ఎన్నికల్లో మరో కీలక పర్వం: టీడీపీ ఫోకస్ అటు వైపే
అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల జోరు కొనసాగుతోంది. తొలి విడత పోలింగ్.. ఫలితాల వెల్లడి అనంతరం ఇక అందరి చూపు మలి విడతపై పడింది. ఈ నెల 13వ తేదీన నిర్వహించబోయే రెండో విడత పోలింగ్ కోసం ఏర్పాట్లు సాగుతున్నాయి. తొలివిడతలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షో నడిచింది. మెజారిటీ పంచాయతీలను తన ఖాతాలో వేసుకుంది. తెలుగుదేశం పార్టీ రెండో స్థానంలో నిలిచింది. వైఎస్సార్సీపీ-టీడీపీలు గెలుచుకున్న పంచాయతీల సంఖ్య మధ్య ఆంతరం భారీగా ఉంది. ఈ పరిస్థితుల్లో మిగిలిన మూడు విడతల్లో అధిక పంచాయతీలను గెలుచుకోవడంపై తెలుగుదేశం పార్టీ ఫోకస్ పెట్టింది.
తొలిదశ పంచాయతీ పోరు రేపే: నవ్యాంధ్రలో ఫస్ట్టైమ్: ప్రత్యేకతలెన్నో: పోలింగ్ కేంద్రాల వివరాలివే
ఈ నేపథ్యంలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం కాస్సేపట్లో ఆరంభం కాబోతోంది. ఇవి చివరి విడత ఎన్నికలు, ఈ నెల 21వ తేదీన పోలింగ్. ఉదయం 10 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. అన్ని జిల్లాల్లో 3299 పంచాయతీలకు చివరి విడత ఎన్నికలను నిర్వహించనున్నారు. తొలి రెండు విడతల్లోనూ వెయ్యికి పైగా ఏకగ్రీవాలు నమోదైన పరిస్థితుల్లో.. మిగిలిన చివరి రెండు దశల్లో వాటి ప్రభావం ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. రెండు రోజుల పాటు సాగే నామినేషన్ల దాఖలు ప్రక్రియ, స్క్రూటినీ.. అనంతరం ఉపసంహరణ తరువాతే- ఏకగ్రీవాల వివరాలు వెల్లడవుతాయి.
తొలి విడతలో 524 రెండో దశలో 522 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. వాటిల్లో 90 శాతం మేర అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఉన్నారు. చివరి రెండు విడతల్లో అదే స్థాయిలో ఏకగ్రీవాలను సాధిస్తామనే ధీమా వైఎస్సార్సీపీ నేతల్లో వ్యక్తమౌతోంది. ఏకగ్రీవాల కోసం ప్రభుత్వం అనుసరించిన వ్యూహం ఫలిస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి. లక్షల్లో ప్రోత్సాహకాలను ప్రకటించడం వల్ల మరిన్ని పంచాయతీలు ఏకగ్రీవంగా సర్పంచ్ను ఎన్నుకుంటాయని చెబుతున్నారు. ఏకగ్రీవాలకు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ-జనసేన వ్యతిరేకంగా ఉంటున్నాయి.