కందరాడలో ఫిబ్రవరి 13న రీపోలింగ్: బ్యాలెట్ పత్రాల అపహరణే కారణం
తూర్పుగోదావరి: పిఠాపురం మండలం కందరాడలో ఫిబ్రవరి 13న రీపోలింగ్ జరగనుంది. బ్యాలెట్ పత్రాలను దుండగులు ఎత్తుకెళ్లిన నేపథ్యంలో ఇక్కడ రీపోలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. మంగళవారం రాత్రి కందరాడలో కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కొంతమంది దుండగులు అక్రమంగా కేంద్రంలోకి చొరబడి చివరి రౌండ్ బ్యాలెట్ పత్రాలను ఎత్తుకెళ్లారు.
ఈ క్రమంలో తనకు అన్యాయం జరిగిందని టీడీపీ మద్దతుదారు, అభ్యర్థి పిల్ల సుశీల ఆందోళన చేపట్టారు. అంతేగాక, తననే విజేతగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అయితే, కౌంటింగ్ జరగకుండా సర్పంచ్ను ప్రకటించలేమంటూ అధికారులు ఎన్నికలను వాయిదా వేశారు. అనంతరం బుధవారం ఉదయం 6గంటలకు రీకౌంటింగ్ నిర్వహించి పోలైన ఓట్లను సరిచూశారు.
సుమారు 43 బ్యాలెట్ పత్రాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. ఈ విషయాన్ని ఆర్వో ప్రకాశ్ రావు, ఆర్డీవో చిన్నికృష్ణ, డీఎస్పీ భీమారావు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో అభ్యర్థి సుశీల తమ వర్గీయులతో కాకినాడకు తరలివెళ్లి కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.
ఈ నేపథ్యంలో స్పందించిన కలెక్టర్.. ఫిబ్రవరి 13న కందరాడలో రీపోలింగ్కు ఆదేశించారు. మరోవైపు, బ్యాలెట్ పత్రాలను ఎత్తుకెళ్లిన ఘటనలో ఆర్వో ప్రకాశ్ రావు ఫిర్యాదు మేరకు అదే గ్రామానికి చెందిన ఐదుగురిపై పిఠాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోగా. టీడీపీ రెండో స్థానంలో నిలిచింది.