బాలకృష్ణ లెవెల్లో చంద్రబాబు తొడగొట్టినా: గోచీ తలకు చుట్టుకుంటే ఎలా: వైస్రాయ్ కుట్ర: సజ్జల
అమరావతి: పంచాయతీ ఎన్నికల తొలిదశ ఫలితాలతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఆరంభమైందంటూ తెలుగుదేశం చేస్తోన్న విమర్శలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తప్పు పట్టారు. 81 శాతానికి పైగా వైఎస్సార్సీపీ మద్దతుదారులు పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించారని, దీన్ని పక్కదారి పట్టించేలా టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మిగిలిన మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీని సాధించడానికి తన అనుకూల మీడియాతో కలిసి చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు.
అమరావతి సహా అన్ని చోట్లా
కొద్దిసేపటి కిందటే ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ తన ఆయువుపట్టుగా భావిస్తోన్న అమరావతి రీజియన్, గుంటూరు జిల్లాల్లో వైసీపీ మద్దతుదారులు అత్యధిక పంచాయతీలను గెలుచుకున్నారని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. దీన్ని పక్కదారి పట్టించేలా అనుకూల మీడియాలో కథనాలను ప్రచురించుకుంటున్నారని విమర్శించారు. మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఇలాకాలతో టీడీపీ మద్దతుదారులు మూడు పంచాయతీలను మాత్రమే గెలుచుకున్నారని దీనికి భిన్నంగా మీడియాలో కథనాలు వస్తున్నాయని చెప్పారు.
గోచీని తలకు చుట్టుకున్నట్లు..
చంద్రబాబు పరిస్థితి బడాయికి పోయి గోచీని తలకు చుట్టుకున్నట్టుగా మారిందని సజ్జల ఎద్దేవా చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పున పరిహసించేలా ఆయన వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. 81 శాతానికి పైగా పంచాయతీలు అధికార పార్టీకి దక్కాయనే అక్కసు చంద్రబాబలో స్పష్టంగా కనిపిస్తోందని మండిపడ్డారు. ప్రజల మనోభావాలను ప్రభావితం చేసేలా ఓ సరికొత్త డ్రామాకు చంద్రబాబు తెర తీశారని, ఈ వయస్సులో ఆయన ఇన్ని తిప్పలు పడటం, కుట్ర పూరిత రాజకీయాలకు పాల్పడటం చూస్తోంటే ఏమనాలతో తెలియట్లేదని వ్యాఖ్యానించారు.
వైస్రాయ్ తరహా కుట్ర.. అంకెల గారడి..
మిగిలిన మూడు విడతల పోలింగ్ను ప్రభావితం చేసేలా..మీడియాను అడ్డుగా పెట్టుకుని వైస్రాయ్ తరహా కుట్రకు చంద్రబాబు తెర లేపారని ఆరోపించారు. అనుకూల మీడియాలో ఇష్టానుసారంగా అంకెలను ముద్రించుకుంటూ చంద్రబాబు అంకెల గారడీ చేస్తోన్నారని సజ్జల విమర్శించారు. తమ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచ్లందరి ఫొటోలను తాము అందుబాటులోకి తీసుకొస్తామని, ఆ పని చేయగలిగే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ఆయన సవాల్ విసిరారు. అంకెలు మార్పించవచ్చు గానీ.. అభ్యర్థులను మార్పించలేరని చెప్పారు.
బాలకృష్ణ లెవెల్లో తొడగొట్టిన చంద్రబాబు..
పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ప్రజల తీర్పును ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయారని అన్నారు. అపరిమిత అధికారాలతో తన చేతుల్లో ఉన్నాయంటూ, ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేయడానికి ఆయన ప్రయత్నించారని చెప్పారు. కరోనా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని తాము ఎన్నికలను వాయిదా వేయడానికి ప్రయత్నించగా.. టీడీపీ నేతలు సవాళ్లు విసిరారని గుర్తుచేశారు. చంద్రబాబు నాయుడు.. బాలకృష్ణ లెవెల్లో తొడలు గొట్టి, సవాల్ విసిరారని అన్నారు.