సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ పిటీషన్: జస్టిస్ లావు నాగేశ్వర రావు బెంచ్ కాదిక: చివరి గంటల్లో
అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి వీలుగా ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దేశ అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటీషన్.. బెంచ్ మారింది. సోమవారం ఈ పిటీషన్పై విచారణ చేపట్టాల్సి ఉండగా.. చివరి గంటల్లో బెంచ్ మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పంచాయతీ ఎన్నికలను నిర్వహించుకోవడానికి వీలుగా హైకోర్టు డివిజనల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ అది.
Recommended Video
మొదట ఈ పిటీషన్.. జస్టిస్ లావు నాగేశ్వర రావు సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి లిస్ట్ అయింది. జస్టిస్ లావు నాగేశ్వర రావుతో పాటు జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఇందు మల్హోత్రాలు ఈ బెంచ్లో ఉన్నారు. తాజాగా జగన్ సర్కార్ వేసిన పిటీషన్ బెంచ్ మారింది. జస్టిస్ సంజయ్ కిషన్ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల బెంచ్కు బదిలీ అయింది. జస్టిస్ సంజయ్ కిషన్ బెంచ్కు దీన్ని రీలిస్ట్ చేశారు. ఆయనతో పాటు జస్టిస్ హృషికేష్ రాయ్ ఈ పిటీషన్పై సోమవారం విచారణ నిర్వహించనున్నారు.
హఠాత్తుగా బెంచ్ మారడానికి గల కారణాలేమిటనేది తెలియ రాలేదు. ప్రస్తుతం అందరి దృష్టీ సుప్రీంకోర్టు మీదే నిలిచింది. వచ్చేనెల 5వ తేదీన తొలి దశ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ సైతం జారీ చేసిన ప్రస్తుత పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది చర్చనీయాంశమౌతోంది. కేరళ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే పంచాయతీ ఎన్నికలను నిర్వహించారు.
కేరళలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించిన తరువాత.. రోజుావారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిందంటూ ఇదివరకు పినరయి ప్రభుత్వం వెల్లడించింది. ఈ వాదనను ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయవాది.. సుప్రీంకోర్టులో వాదించే అవకాశం ఉంది. అలాగే- కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలను నిర్వహించలేమనే విషయాన్ని స్పష్టం చేయబోతోంది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్నూ సుప్రీంకోర్టు విచారించబోతోంది.