జగన్ సర్కార్తో నిమ్మగడ్డ విభేదాలు: అసెంబ్లీ స్పీకర్ ఎంట్రీ: మంత్రుల చివరి అస్త్రం: నోటీసులు?
అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్- ప్రభుత్వం మధ్య ఏర్పడిన విభేదాలు మరో మలుపు తీసుకున్నాయి. ఈ వివాదం అసెంబ్లీ పరిధిలోకి వెళ్లింది. చట్టసభ వ్యవస్థ ఇందులో ఎంట్రీ ఇచ్చారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్కు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులను చేసినట్లు తెలుస్తోంది. రమేష్ కుమార్పై మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి స్పీకర్ తమ్మినేని సీతారాంకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఈ లేఖల ఆధారంగా స్పీకర్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
తమపై ఎస్ఈసీ చేస్తోన్న వ్యాఖ్యల పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ విధి నిర్వహణలో జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల హక్కులకు భంగం కలిగించేలా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కొద్దిరోజులుగా ఆయనపై విమర్శలు గుప్పిస్తోన్న మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బొత్స సత్యనారాయణ.. ఈ విషయాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. తమపై ఫిర్యాదు చేస్తూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు లేఖ రాసిన నిమ్మగడ్డ.. దాన్ని మీడియాకు లీక్ చేశారని లేఖలో పేర్కొన్నారు.
చట్టసభల వ్యవహారాలకు భంగం కలిగించేలా, తమ విధుల్లో అనవసరంగా జోక్యం చేసుకునేలా ఉందని వారు అన్నారు. ఇది సభా హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రజా ప్రతినిధుల హక్కుల పరిరక్షించే బాధ్యత స్పీకర్కు ఉందని వారు గుర్తు చేశారు. తమపై చేసిన ఆరోపణలు, గవర్నర్కు రాసిన లేఖ లీక్ చేయడం వంటి చర్యలను సభా హక్కుల ఉల్లంఘన కింద పరిగణించాలని కోరారు.
దీన్ని పరిశీలించిన అనంతరం.. స్పీకర్ కార్యాలయం నిమ్మగడ్డ రమేష్ కుమార్కు సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులను పంపించినట్లు తెలుస్తోంది. దీన్ని ఇమెయిల్ ద్వారా పంపించినట్లు సమాచారం. దీనికి సంతృప్తికరమైన వివరణ ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం.. ఎస్ఈసీని ఆదేశించినట్లు చెబుతున్నారు. ఆయన ఇచ్చే వివరణ ఆధారంగా.. తదుపరి చర్యలు ఉండొచ్చని అంటున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం, జగన్ సర్కార్ మధ్య కొనసాగుతోన్న విభేదాల్లో చట్టసభా వ్యవస్థ జోక్యం చేసుకున్నట్టయింది.