కట్టప్ప కంటే కరడుగట్టిన బానిసగా నిమ్మగడ్డ: సాయిరెడ్డి ఫైర్: డెమోక్రసీ అంటే 'మన' స్వామ్యమా
అమరావతి: తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ఉద్దేశించిన నోటిఫికేషన్ను విడుదల చేసిన అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై విమర్శల దాడి పెరిగింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆయనను టార్గెట్గా చేసుకుంది. వరుసబెట్టి విమర్శలు, ఆరోపణలను సంధిస్తోంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి అనువైన వాతావరణం లేదంటూ ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు యంత్రాంగం అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నప్పటికీ.. నిమ్మగడ్డ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు.
టీడీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అదే క్రమంలో- వైసీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి- మరోసారి నిమ్మగడ్డపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీకి కట్టుబానిసలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. బానిస అంటే ఇది వరకు కట్టప్ప పాత్ర గుర్తుకు వచ్చేదని, ఇప్పుడు నిమ్మగడ్డ జ్ఞప్తికి వస్తున్నారని విమర్శించారు. కట్టప్పది కల్పిత పాత్ర కాగా.. దానికి వందరెట్లు కరడు గట్టిన గులాంగిరి ప్రదర్శించే నిమ్మగడ్డ మన మధ్యనే ఉన్నాడంటూ సాయిరెడ్డి ధ్వజమెత్తారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సేవలో పులకిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు తీయడానికి ఉవ్విళ్లూరుతున్నాడంటూ సాయిరెడ్డి విరుచుకుపడ్డారు. కట్టప్ప కథ సుఖాంతం అయినా, నిమ్మగడ్డను మాత్రం రాష్ట్రం ఎప్పటికీ క్షమించదని హెచ్చరించారు. చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ పనిచేస్తున్నారనేది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ అర్థమైపోయిందని చెప్పారు. ఎన్నికలను నిర్వహించకూడదంటూ ఒకసారి.. అవే ఎన్నికలను నిర్వహించాలంటూ మరోసారి.. ఇలా చంద్రబాబు చెప్పినట్లు నిమ్మగడ్డ నడుచుకుంటున్నారని అన్నారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ దృష్టిలో ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోయిందని సాయిరెడ్డి ఆరోపించారు. ఆయన దృష్టిలో ప్రజాస్వామ్యం అంటే ఏమిటని ప్రశ్నించారు. డెమోక్రసీ అంటే జనస్వామ్యమా.. లేక మన స్వామ్యమా? అని ప్రశ్నించారు. కేరళలో రోజూ వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని సాయిరెడ్డి గుర్తు చేశారు. వారం రోజులుగా సగటున ఆరువేల కేసులు వెలుగులోకి వస్తున్నాయని, ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉండి ఉద్యోగులు ఎంతో కష్టపడి ఏపీలో కరోనా కేసులు తగ్గించారని అన్నారు. కేరళలో సింగిల్ డిజిట్ కి వచ్చిన కేసులు పంచాయతీ ఎన్నికల తర్వాత రోజుకు సగటున 6,000 కేసులు నమోదవుతూ రోజుకు 20 మంది చనిపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.