కరోనా వ్యాక్సిన్..ఫ్రీ వైఫై: టీడీపీ పంచాయతీ మేనిఫెస్టోలోని కీలకాంశాలివే
అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్కు గడువు సమీపిస్తోండటంతో అన్ని రాజకీయ పార్టీలూ దానిపై దృష్టి సారించాయి. మెజారిటీ పంచాయతీలను ఏకగ్రీవంగా గెలుచుకోవడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోండగా.. దానికి ధీటుగా ప్రత్యర్థి పార్టీలు సమాయాత్తమౌతోన్నాయి. తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ-జనసేన సమరశంఖాన్ని పూరిస్తున్నాయి. వైఎస్సార్సీపీని కార్నర్ చేసేలా వ్యూహాలను రూపొందించుకుంటున్నాయి. ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ ఓ అడుగు ముందే నిలిచినట్లు కనిపిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
పల్లె ప్రగతి-పంచసూత్రాల పేరుతో
పల్లె ప్రగతి-పంచసూత్రాల పేరుతో రూపొందించిన ఈ మేనిఫెస్టోను టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు. అమరావతి ప్రాంతంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన దీన్ని ఆవిష్కరించారు. గ్రామాల అభివృద్ధి సంబంధించిన కొన్ని కీలకాంశాలను ఇందులో పొందుపరిచారు. తాము మద్దతు ఇచ్చిన అభ్యర్థలుు విజయం సాధించిన గ్రామాల్లో చేపట్టబోయే అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి రెండు పేజీల ఈ మేనిఫెస్టోలో వివరించారు.
రక్షిత మంచినీటి సరఫరా..
సురక్షితమైన, స్వచ్ఛమైన మంచినీటిని ప్రతి ఇంటికీ సరఫరా చేస్తామని ఈ మేనిఫెస్టోలో పొందుపరిచారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అన్ని కుటుంబాలకు ఉచితంగా మంచినీటి కుళాయిల కనెక్షన్లను మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలోనూ నీటి శుద్ధి కేంద్రాలను నెలకొల్పుతామని పేర్కొన్నారు. గ్రామాలను నేరరహితంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. పల్లెల్లో కక్షలు, కార్పణ్యాలను రూపుమాపుతామని, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తామని చెప్పారు. పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, దేవాలయాల వద్ద సీసీటీవీ కెమెరాలను అమర్చుతామని హామీ ఇచ్చారు.
ఆదర్శ గ్రామాల కాన్సెప్ట్..
గ్రామీణ స్థాయిలో బాలికా విద్యను ప్రోత్సహిస్తామని చంద్రబాబు ఈ మేనిఫెస్టో ద్వారా ప్రకటించారు. ప్రతి వీధిలోనూ ఎల్ఈడీ దీపాలను అమర్చుతామని, అవననీ సక్రమంగా వెలిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. పట్టా భూములు, అసైన్మెంట్ భూములు కబ్జాకు గురి కాకుండా ఉండటానికి రక్షణ కల్పిస్తామని అన్నారు. భూసర్వేలో భూయాజమాన్య హక్కులపై నిఘా పెడతామని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన చోట్ల ఆదర్శ గ్రామీణ వ్యవస్థను అభివృద్ధి చేస్తామని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను సద్వినియోగం చేసుకుంటూ అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలోనూ ఉచితంగా వైఫై సౌకర్యాన్ని కల్పిస్తామని అన్నారు.
మీటర్ల బిగింపును అడ్డుకుంటాం..
వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లను అమర్చడాన్ని అడ్డుకుంటామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ పంచాయతీలో మొదటి తీర్మానం చేస్తామని అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పంచాయతీల సహకారంతో వడ్డీలేని రుణాలను అందిస్తామని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో గ్రామాల్లో సమగ్ర సర్వే చేపడతామని, గ్రామ సభ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలను అందిస్తామని, కోవిడ్ వ్యాక్సిన్ అందించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.