జగన్ అరాచకాలపై కేంద్రం సీరియస్ -చూస్తూ ఊరుకోబోమన్న అమిత్ షా: వెల్లడించిన టీడీపీ ఎంపీలు
ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 20 నెలలుగా అరాచక పాలన సాగుతోందని, రాజ్యాంగ వ్యవస్థలను పరిహాసం చేయడం, చట్టాల ఉల్లంఘన పరిపాటిగా మారిందని, ప్రశ్నించిన వాళ్లందరి గొంతులు నొక్కుతూ జగన్ అచ్చోసిన నియంతలా వ్యవహరిస్తున్నాడని ప్రతిపక్ష టీడీపీ మండిపడింది. వైసీపీ సర్కారు పోకడలు, జగన్ నియంతృత్వం తీరుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశామని ఆ పార్టీ నేతలు తెలిపారు. వివరాల్లోకి వెళితే..
షాతో టీడీపీ ఎంపీల భేటీ..
ఏపీలో ప్రతిపక్షమైన టీడీపీ ఎంపీలు బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు సాగిన భేటీలలో.. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పలు అంశాలను ఎంపీలు హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఏపీలో దేవాలయాలపై దాడులు, శాంతి భద్రతలపై విఘాతం రాజ్యాంగసంస్థలపై దాడిని అమిత్షాకు వివరించారు. అమిత్షాను కలిసిన వారిలో గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్నాయుడు, కనకమేడల రవీంద్రలు ఉన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..
ఏపీ పరిస్థితులపై కేంద్రం సీరియస్..
ఏపీలో మత మార్పిడులు, ఆలయాలపై దాడులు, రాజ్యాంగ సంస్థల విధ్వంసం, కుప్పకూలిన శాంతిభద్రతలు తదితర అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని, అరాచక పాలన, ఆస్తుల విధ్వంసం, వ్యక్తుల అక్రమ నిర్బంధం, ప్రతిపక్షాలపై కేసులకు సంబంధించి పూర్తి ఆధారాలను సమర్పించామని, అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేసిన తీరును కూడా వివరించామని టీడీపీ ఎంపీలు చెప్పారు. ఇన్నాళ్లూ ఏపీలో పరిస్థితులపై జగన్ ఏకపక్షంగా చెప్పిన విషయాలనే వింటోన్న కేంద్రానికి.. టీడీపీ రిపోర్టుల ద్వారా మొదటిసారిగా వాస్తవ పరిస్థులు తెలిసొచ్చాయని, ఏపీలో పరిస్థితులపై కేంద్రం సీరియస్ గా పరిశీలిస్తుందని అమిత్ షా భరోసా ఇచ్చారని టీడీపీ ఎంపీలు మీడియాకు చెప్పారు. అంతేకాదు..
చూస్తూ ఊరుకోబోమన్న అమిత్ షా..
''ప్రభుత్వమే ఏకగ్రీవాలకు పిలుపునిచ్చింది కాబట్టి, కాంప్రమైజ్ కోసం అచ్చెన్న తన సోదరుడితో మాట్లాడితే, అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించారు. అదే నిమ్మాడలో దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి దౌర్జన్యానికి పాల్పడితే వదిలేశారు. సోషల్ మీడియాగానీ, సాధారణ మీడియా ద్వారా గానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించి, లేదా నిలదీసిన అందరిపైనా దమనకాండకు దిగుతున్నారు. ఏపీలో ఏకపక్షంగా నియంతృత్వ పాలన జరుగుతోంది. రాజ్యాంగ సంస్థలను పనిచేయనీయడం లేదు. వీటన్నింటిపై దర్యాప్తు చేయించాలని అమిత్ షాను కోరాం. ఏపీలో పరిస్థితులు ఇలా దిగజారితే మేం చూస్తూ ఊరుకోబోమని షా అన్నారు. మొత్తం ఆధారాలను ఇచ్చివెళ్లాలని, త్వరితగతిన వాటిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు'' అని టీడీపీ ఎంపీ కనకమేడల మీడియాకు చెప్పారు.
మియా ఖలీఫాపై మోదీ సర్కార్ ఫైర్ -గ్రెటా, మీనా, రిహానాపైనా ఆగ్రహం -రైతుల పోరులో సంచలనం