ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు... కొనసాగుతోన్న పోలింగ్...
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నేడు(ఫిబ్రవరి 17) మూడో విడత పోలింగ్ జరుగుతోంది. ఉదయం 6.30గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓట్లు వేసేందుకు ఓటర్లు తరలివస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. కరోనా బాధితులకు చివరి గంటలో ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత సాయంత్రం 4గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడుతారు.
మూడో విడతలో మొత్తం 3,221 గ్రామ పంచాయతీలలో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ కాగా.. అందులో 579 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 2,639 సర్పంచ్ పదవులకు బుధవారం పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల్లో మొత్తం 7,757 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో 19,553 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరగనుండగా 43,612 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 160 మండలాల పరిధిలోని 26,851 పోలింగ్ కేంద్రాలలో మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో 3,127 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా, మరో 4,118 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 1,977 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల ప్రక్రియను ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా మొదట వార్డుల ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 63,270 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు.
ఏపీలో మొత్తం నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు విడతలు పూర్తయ్యాయి. మూడో విడత ఎన్నికలు నేడు జరగనుండగా... నాలుగో విడత ఫిబ్రవరి 21న జరగనుంది. ఇటీవలే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కూడా నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. గతంలో ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియ ఆగిందో అక్కడి నుంచే మున్సిపల్ ఎన్నికలు కొనసాగనున్నాయి. మార్చి 10న 12 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, మేజర్ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 14న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.