నిమ్మగడ్డ వల్ల జగన్కు నష్టమెంతో తెలుసా? -చతికిలపడ్డా చుక్కల్లో అంకెలా? -ఏపీలోనూ ‘మిషన్ భగీరథ’
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మధ్య అతి తీవ్ర విభేదాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం దేశం దృష్టిని ఆకర్షించింది. పరస్పర దూషణల మధ్యే మొత్తానికి పంచాయితీ ఎన్నికలు ముగిశాయి. గడిచిన ఏడాది కాలంగా నువ్వా-నేనా అన్నట్లు తలపడిన ఆ ఇద్దరూ ఇప్పుడు ఎన్నికల ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, నిమ్మగడ్డ ఉండగా ఎన్నికలు వద్దని వాదించిన వైసీపీకి నిజంగా ఆయన వల్ల ఎంత నష్టం కలిగింది? ఎన్నికల ఫలితాల క్రెడిట్ ఎవరికి దక్కాలి? తరహా ప్రశ్నలకు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ లో సమాధానాలు లభించాయి.
శెభాష్ పెద్దిరెడ్డి..
ఏపీలో పంచాయితీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తూరు జిల్లాసహా రాష్ట్రమంతటా వైసీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొందడంపై మంత్రి పెద్దిరెడ్డిని సీఎం అభినందించారు. పంచాయితీ పోరు ముగియడంతో ఇక పురపోరుపై మంత్రి పెద్దిరెడ్డి దృష్టిసారించారు. కృష్ణా, గుంటూరులోని అన్ని మున్సిపల్, కార్పోరేషన్లను గెలుచుకుంటామంటోన్న ఆయన.. ఇవాళ కృష్ణా జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అయి, మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక అంశాలు తెలియజేశారు..
వన్ అండ్ ఓన్లీ జగన్ వల్లే..
నాలుగు విడతల్లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలుచుకున్నామని, రాష్ట్రం నలుమూలలా వైసీపీ ప్రభంజనం కనిపించిందని, ఎన్నికల్లో పార్టీ గెలుపు క్రెడిట్ మొత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒక్కడికే దక్కుతుంది తప్ప, మిగతా ఎవరిదీ కాదని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. ''మేం చదువుకునే రోజుల్లో అటెండెన్స్ షార్టేజీ వచ్చేది. ఇప్పుడు జగన్ పేరుకు ముఖ్యమంత్రి అయినా.. పని తీరు మాత్రం విద్యార్థిలాగే ఉంటుంది. ఏ రోజూ సమీక్షలను మిస్ చేయరు. ఇచ్చిన మాటకు కట్టుబడే వ్యక్తిగా, ఏడాదిన్నర పాలనలోనే అన్ని హామీలూ నెరవేర్చిన నేతగా జగన్ ను రాష్ట్ర ప్రజలంతా ఆదరించారు. ఆ విషయం పంచాయితీ ఎన్నికల ఫలితాల్లో ప్రస్పుటంగా కనిపించింది. ఈ మధ్యే జాతీయ స్థాయిలో ఉత్తమ సీఎంగా జగన్ పనితీరుకు ప్రశంసంలు లభించాయి. ఇవాళ్టి ఎన్నికల్లోనూ అదే ప్రతిబింబించింది. వైసీపీలోని అందరికీ జగన్ బలం తోడుంది కాబట్టి ప్రతి ఎన్నికలోనూ మంచి ఫలితాలు సాధించాం, సాధిస్తాం'' అని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక..
నిమ్మగడ్డ వల్ల వైసీపీకి 10శాతం నష్టం
ఎస్ఈసీగా నిమ్మగడ్డను అసలే అంగీకరించని వైసీపీ.. ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం కాస్త మెత్తబడ్డట్టు కనిపిస్తోంది. నిమ్మగడ్డను వ్యక్తిగతంగా దూషించి, కోర్టుల్లోనూ ఇబ్బందులు ఎదుర్కొన్న పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి ఇప్పుడు కనీసం ఎస్ఈసీ పేరును కూడా ప్రస్తావించడంలేదు. టీడీపీకి అనుకూలంగా నిమ్మగడ్డ వ్యవహరించారన్న గత ఆరోపణలకు కొనసాగింపుగా.. ఒకవేళ ఎన్నికలు సజావుగా జరిగేదుంటే వైసీపీ ఇంకా ఎన్నో సీట్లు గెలుచుకుని ఉండేదని పెద్దిరెడ్డి వ్యాఖ్యానించారు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలోని పంచాయితీ రాజ్ లెక్కల ప్రకారం.. నిమ్మగడ్డ తీరు వల్ల వైసీపీ ఏకంగా 10 శాతం సీట్లను నష్టపోయింది. అయితే ఎన్నికల ఫలితాలపై టీడీపీ, వైసీపీ అనుకూల మీడియా సంస్థలు తలో లెక్క చెబుతున్నాయని, నిజమైన ప్రభుత్వ లెక్కలు మాత్రం ఇవేనంటూ మంత్రి వివరించారిలా..
ఈనాడు, సాక్షి కాదు.. సర్కారు లెక్కలివి..
టీడీపీ గెలుచుకున్న సీట్లపై ఈనాడు పత్రిక ఒకలా, వైసీపీ గెలుపొందిన స్థానాలపై సాక్షి పత్రిక మరోకలా లెక్కలు రాశాయన్న మంత్రి పెద్దిరెడ్డి.. రాష్ట్రంలోని ఎండీవోల నుంచి నేరుగా తెప్పించుకున్న ఫలితాలను వెల్లడించారు. ఏపీలో మొత్తం 13,095 సర్పంచ్ స్థానాలు ఉండగా, వాటిలో 10,524 స్థానాలను వైసీపీ (బలపర్చిన అభ్యర్థులు) గెలుపొందిందని, మొత్తంలో ఇది 80.37 శాతం సీట్లని మంత్రి తెలిపారు. ప్రతిపక్ష టీడీపీకి 2,063 స్థానాలు దక్కాయని, ఆ పార్టీ 15.75 శాతం స్థానాలను గెలుచుకున్నట్లయిందని, ఇక, ఇతరులు 488 మంది, అంటే 3.88 శాతం సీట్లు గెలుపొందారని పెద్దిరెడ్డి వివరించారు. నిజానికి పంచాయితీ ఎన్నికల్లో వైసీపీ 90 శాతం సీట్లు సాధిస్తుందని అంచనా వేశామని, అయితే, ఎన్నికలు సజావుగా సాగని కారణంగా తాము 10 శాతం సీట్లను కోల్పోయామని, ఎన్నికల్లో ఎన్నో రకాల అవాంతరాలు, ఇబ్బందులను ఎదుర్కొన్నామని చెప్పారు. అడ్డంకుల్ని తట్టుకొని మరీ ఈ స్థాయిలో విజయం సాధించిన వైసీపీ.. ఒకవేళ ఎన్నికలు సజావుగా జరిగుంటే కచ్చితంగా 90 శాతం సీట్లు సాధించి ఉండేదని పెద్దిరెడ్డి అన్నారు. కాగా,
టీడీపీకి 51 శాతం సీట్లా?
''రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వైసీపీ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. కుట్రలు, కుతంత్రాలతో, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని మెజార్టీ సాధించాలనుకున్న చంద్రబాబు చతికిల పడ్డాడు. ఆయన ఓటమి స్పష్టంగా కనబడుతున్నా, గ్రామస్థాయిలో టీడీపీ పునాదులు కదిలిపోతున్నా.. టీడీపీ 51 శాతం సీట్లు గెలిచిందని సత్యదూరమైన మాటలు చెబుతున్నారు. ఆ మేరకు పచ్చ పత్రికల్లో రాతలు రాయిస్తున్నారు. అసలు తొలి దశ ఫలితాల్లోనే చంద్రబాబు గుడ్లుతేలేశాడు, రెండో దశ వైఫల్యం తర్వాత ఎస్ఈసీ నిమ్మగడ్డను తిట్టడం మొదలుపెట్టాడు. ఇక నాలుగోదశ పూర్తయ్యే సరికి తానే గెలిచానని చెప్పుకుంటున్నాడు. నిజంగా ఏ ఊళ్లో ఎవరు గెలిచారో ప్రజలందరీక తెలుసు. గెలవని సీట్లను గెలిచామంటూ చంద్రబాబు ప్రచారం చేసుకోవడం వల్ల వైసీపీ బలం ఇంతైనా తగ్గదు. బాబు సీఎంగా ఉన్నప్పుడు ఆర్థికంగా లబ్ది పొందినవాళ్లంతా కుప్పంలో టీడీపీకి పెట్టుబడులు పెట్టారు. వాళ్లంతా బడా నేతలు, వైసీపీ ఎంపీని, ఇంచార్జిలనే గృహనిర్బంధం చేశారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటే, టీడీపీ తరఫునే తప్ప వైసీపీకి ఆ అవసరమే లేదు. ప్రజలంతా జగన్ వెంట ఉన్నారని తాజా ఫలితాల్లో వెల్లడైంది''అని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. దీని తర్వాత..
ఉభయ గోదావరిలో ‘మిషన్ భగీరథ'
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో వైసీపీ పార్టీ పంచాయితీ ఎన్నికల్లో సాధించిన విజయాలు.. రాబోయే మున్సిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ గెలుపు జగన్ పనితీరుకు దక్కిన గుర్తింపు అన్న మంత్రి.. రాబోయే రోజుల్లో సీఎం మరింత నిబద్ధతతో పనిచేస్తారని, భారీ లక్ష్యాలతో ముదుకు సాగుతున్నారని తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు సంవృద్ధిగా తాగు, సాగు నీరు అందించే దిశగా సీఎం అడుగులు వేగవంతం చేశారని, కలుషిత నీటి వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఉభయ గోదావరి జిల్లాల్లో అతి త్వరలోనే భారీ ప్రాజెక్టును ప్రారంభించబోతున్నామని మంత్రి తెలిపారు. (తెలంగాణలో మిషన్ భగీరథ పథకం లాగా) గోదావరి జిల్లాల్లో ఇంటింటికీ కొళాయి ద్వారా మంచినీరు సరఫరా చేసే ప్రాజెక్టును చేపట్టబోతున్నామన్నారు.