నిమ్మగడ్డపై జగన్ సర్కారు పిడుగు -కరోనా వ్యాక్సినేషన్ రీషెడ్యూల్? -ఎస్ఈసీదే బాధ్యతన్న సజ్జల
ప్రజల ఆరోగ్యం నేపథ్యంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఆటంకంగా ఉన్న ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయడానికి తమకున్న ఆప్షన్లన్నీ వాడుకున్నామని, ఇవాళ్టి సుప్రీంకోర్టు తీర్పుతో ప్రభుత్వానికి ఉన్న దారులన్నీ మూసుకుపోయాయని, దీంతో ఎన్నికల ప్రక్రియకు ఆహ్వానిస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. పంచాయితీ ఎన్నికలపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సీఎం జగన్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ వాయిదాపై హింట్ ఇచ్చారు. సజ్జల ఏమన్నారో ఆయన మాటల్లోనే...
Recommended Video
నిమ్మగడ్డతో పోరులో జగన్ వైఫల్యానికి కారణమిదే -తర్వాత స్టెప్ ఇదైతేనే సేఫ్: ఎంపీ రఘురామ
ఎస్ఈసీతో భేషజాలు లేవు..
''పంచాయితీ ఎన్నికల విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. అయితే కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో, ప్రజారోగ్యం దృష్ట్యా చీఫ్ సెక్రటరీ మొదలుకొని, అన్ని స్థాయిల అధికారులు, ఉద్యోగులు తమ ఆందోళనను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్, ఎన్నికల ప్రక్రియ ఒకేసారి చేపట్టడం వీలుకాదని, అలా చేస్తే వ్యాక్సిన్ ద్వారా కరోనాను నివారించాలన్న లక్ష్యం నెరవేరబోదన్న విషయాన్ని ఎన్నికల కమిషనర్ కు వివరించినా ఆయన పట్టించుకోక పోవడంతో ప్రభుత్వం కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఇందులో భేషజాలు లేవు. బాధ్యతాయుతమైన ప్రభుత్వంగానే మేం వ్యవహరించాం. అయితే..
ఆ విషయంలో ఇంకా సందిగ్ధత..
వ్యాక్సినేషన్ ఎన్నికలకు అడ్డంకి కానే కాదని చెప్పిన సుప్రీంకోర్టు.. ఎన్నికల వేళ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎలా నిర్వహిస్తారనేది తమకు తెలీదని, ఎన్నికల కమిషన్ ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోబోమని, ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని పేర్కొంది. మరి మున్సిపల్ ఎన్నికలను పక్కన పెట్టేసి, ముందుగా పంచాయితీ ఎన్నికలను నిర్వహిస్తుండటం గమనార్హం అయినప్పటికీ, అది ఎస్ఈసీ నిర్ణయం కాబట్టి ఎత్తిచూపే పరిస్థితి లేదు.వ్యాక్సినేషన్ విషయంలో మాకు ఇప్పటికీ సందిగ్ధత ఉంది. మాకు పొద్దుపోకనో, ఊసుపోకనో లేక ఎవరిమీదో పైచేయి సాధించడానికో మేం ఆలోచనలు చేయలేదు. వ్యాక్సినేషన్, ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం కష్టమని పోలీసులు, ఇతర ఉద్యోగులు చెబుతున్నారు. టీకాలు తీసుకున్న తర్వాత విధిగా పాటించాల్సిన నియమాలుంటాయి. మరి అలాంటప్పుడు ఎన్నికలు పెడితే వ్యాక్సినేషన్ ప్రక్రియకు విఘాతం ఏర్పడుతుంది. ఈ విషయంలో..
కరోనా వ్యాక్సినేషన్ వాయిదా?
ఎన్నికలు, వ్యాక్సినేషన్ ను ఒకేసారి ఎలా ముందుకు తీసుకెళ్ళాలనేదానిపై కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని తీసుకుంటాం. ఎందుకంటే వ్యాక్సిన్ల విషయంలో అన్ని రాష్ట్రాలూ కేంద్రం మార్గదర్శకాలనే పాటిస్తున్నాయి. ఏపీలో ప్రత్యేక పరిస్థిపై కేంద్రం సలహాలు తీసుకుంటాం. ఎన్నికల వాయిదాకు కోర్టులు నో చెబుతున్నాయి కాబట్టి, వ్యాక్సినేషన్ ప్రక్రియనైనా రీషెడ్యూల్ చేయొచ్చా? అని కేంద్రాన్ని అడుగుతాం. కేంద్రం నుంచి సమాధానం వచ్చేలోగా రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతుంది. కేంద్ర సిబ్బంది కోసం ఎస్ఈసీ రాసిన లేఖ పనిలేక చేసిన వ్యవహారమని నేను భావిస్తున్నాను. కోర్టు తీర్పు తర్వాత ఆయన పిలవాల్సింది రాష్ట్ర అధికారులను కదా? అది వదిలేసి, కేంద్రానికి లేఖలు రాయడమేంటో అర్థంకావడంలేదు. ఎదుటివారిపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నట్లు అనిపిస్తోంది. కాగా..
ఎన్నికలకు వైసీపీ ఆహ్వానం..
వైసీపీకి సంబంధించినంత వరకు ఎన్నికలకు అన్ని రకాలుగా ఎల్లవేళలా సిద్ధంగానే ఉన్నాం. స్థానిక ఎన్నికల విషయంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ కుయుక్తులు పన్నారన్నది సుస్పష్టం. సగంలో ఆగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలను పక్కన పెట్టేసి, కొత్తగా పంచాయితీ ఎన్నికలను తీసుకురావడంలోనే ఆయన 'వేరే' ఆలోచన బయటప పడింది. నాడు 10 రోజులు ఆగేదుంటే ఎన్నికలు పూర్తయ్యేవి. ఇప్పుడు కరోనా పరిస్థుల్లో ఎన్నికల వల్ల వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం పొంచిఉంది. ప్రజారోగ్యం కోసం మేం చేసిన ప్రయత్నాలు సఫలంకాని వేళ.. ఒక రాజకీయ పార్టీగా వైసీపీ ఎన్నికల ప్రక్రియను ఆహ్వానిస్తోంది. ఎన్నికల్లో గెలవబోయేది మేమే. ఇదిలా ఉంటే..
మాకు 151 సీట్లు.. నిమ్మగడ్డకే అహం..
పంచాయితీ వివాదంపై సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం సరైన వాదనలు వినిపించలేదు అనడం సరికాదు. ఎందుకంటే మేం ఉన్న వాస్తవాలను మాత్రమే కోర్టుల ముందుంచాం. తికమక వాదనలు చేయడానికి ఇదేమీ మర్డర్ కేసు కాదు. కానీ జడ్జిలు వాటిని మరోలా చూశారు. రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య విభేదాలు ఎందుకొచ్చాయనేది ఆలోచించాలి. చాలా బలంగా ఉన్న వైసీపీ ప్రభుత్వానికి ఏకవ్యక్తి నిమ్మగడ్డతో సమస్యలుండవు. ఒకవేళ ఇగో ప్రాబ్లమ్ ఉంటేగనుక అది నిమ్మగడ్డకే ఉంటుంది తప్ప ప్రభుత్వానికి కాదు. ఓట్లతో, 151 సీట్లతో గెలిచిన ప్రభుత్వానికి ఇగో సమస్య లేనేలేదు. నిజానికి కరోనా సమస్య పెద్దగా లేనప్పుడు ఎన్నికలను వాయిదా వేసి.. ఇవాళ నిజంగా ప్రాబ్లెం ఉన్నప్పుడు పెడతామనడం అర్థరహితం. అయితే కోర్టు తీర్పే అందరికీ శిరోధార్యం. మాకున్న దారులన్నీ మూసుకుపోయాయి. ఎన్నికల్లో అగ్రెసివ్ గానే ముందుకు వెళతాం. అయితే..
ప్రభుత్వానిది బాధ్యత కాదు..
ఉద్యోగులు తమ ప్రాణభయాలను వ్యక్తం చేస్తే.. దాన్ని తనకు వ్యతిరేక చర్యగా ఎస్ఈసీ భావించి.. సిబ్బంది కావాలంటూ కేంద్రాన్ని కోరడం ఆయన విపరీత మనస్తత్వాన్ని సూచిస్తోంది. ఎన్నికల విషయంలో ఇంత మొండిపట్టుదలగా ఎస్ఈసీ వ్యవహరించారు కాబట్టి.. నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదల్చుకున్నా.. ఎన్నికల వల్ల రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రమాదం పెరిగితే గనుక ఆ బాధ్యత నిమ్మగడ్డదే తప్ప ప్రభుత్వం మీదికి రాదు. ఎస్ఈసీ దుందుడుకు, ఏకపక్షవైఖరి వల్ల తలెత్తిందిగానే భావించాలి. రాజ్యాంగం తనకిచ్చిన బాధ్యతలను ఆయన హక్కులుగా భావిస్తున్నారు. రేపు ఏదైనా జరగరానిది జరిగితే ప్రభుత్వానికి సంబంధం లేదు'' అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
సుప్రీం తీర్పు -ఇక గవర్నర్దే తుది నిర్ణయం -జగన్ సర్కారుపై టీడీపీ ఫిర్యాదు -ఇగో వదిలేదాకా.