ఏపీలో నేటి నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ... కనిపించని ఏర్పాట్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి ప్రభుత్వం ససేమిరా అంటోంది. అయినా సరే ఎన్నికలు నిర్వహించి తీరుతాం అని పట్టిన పట్టు విడవకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ అడుగులు వేస్తున్నారు. ఈరోజు నుండి నామినేషన్ల ప్రక్రియ కొనసాగాల్సి ఉండగా పంచాయతీ ఎన్నికల వ్యవహారం ఇప్పుడు తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
Recommended Video
చంద్రబాబు కోసం నిమ్మగడ్డ పిచ్చి పీక్స్ కి, ఏ అధికారి పని చెయ్యరు : ఎస్ఈసీకి వైసీపీ మంత్రుల కౌంటర్
ఎన్నికల నిర్వహణకు ఉద్యోగుల సహాయనిరాకరణ
ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో, నోటిఫికేషన్ లో భాగంగా నేటి నుంచి తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నామినేషన్ల స్వీకరణ జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు ఏపీలో తీవ్ర ఉత్కంఠగా మారింది.
ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఉద్యోగులు సహాయనిరాకరణ కొనసాగిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు ససేమిరా అంటున్నారు.
నేటి నుండే నామినేషన్లు .. ఎక్కడా కనిపించని ఏర్పాట్లు
నోటిఫికేషన్ ప్రకారం ఈ రోజు నుంచి నామినేషన్లు తీసుకోవాల్సి ఉండగా తొలి విడత నామినేషన్లకు సంబంధించిన ఏర్పాట్లను చేసి, రిటర్నింగ్ అధికారులను నియమించాల్సిన జిల్లా కలెక్టర్లు ఇప్పటివరకు ఆ దిశగా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలను పక్కనపెట్టి, ప్రభుత్వ ఉత్తర్వుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఏపీలో కనిపిస్తుంది. ఎన్నికల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో విభేదించడం తో ప్రస్తుతం ఏపీలో తీవ్ర వివాదం నడుస్తోంది.
ఇప్పటికీ జిల్లాలలో జారీ కాని ఎన్నికల నోటిఫికేషన్లు .. కలెక్టర్లు సైలెంట్
అసలు ఈ ఎన్నికలు కొనసాగుతాయా? అన్న ఆందోళన తాజా పరిణామాల నేపథ్యంలో కనిపిస్తోంది.
ఇవాళ ఉదయం 10 గంటలకే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించాల్సి ఉండగా, ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు లేవని తెలుస్తోంది. ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావిస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వ ఉద్యోగులు కూడా తీర్పుకోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 27వ తేదీన నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ కాగా, ఇప్పటికీ జిల్లాలలో కలెక్టర్లు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయలేదు.
నో ఎలక్షన్స్ .. నో నామినేషన్స్ అన్న విధంగా అధికారుల తీరు
ఎన్నికలు నిర్వహించమని నామినేషన్ల స్వీకరణకు కూడా ఎవరూ అందుబాటులో ఉండబోమని అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ ఎన్నికలను బలవంతంగా నిర్వహించాలని చూస్తే సమ్మె బాట పడతామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు నామినేషన్లు దాఖలు చేయడానికి ప్రతిపక్షాలు సన్నద్ధంగా ఉన్నాయి. ఇక ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ సర్వత్రా కొనసాగుతుంది.