ఉమ్మడి పోరాటం ద్వారానే లక్ష్యసాధన;ఉద్యమాల షెడ్యూల్ ఇదే:రౌండ్ టేబుల్ నిర్ణయాలు
విజయవాడ:ఐక్యంగా పోరాడటం ద్వారానే లక్ష్యాన్ని సాధించగలమని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి సభ్యులు నిర్ణయించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రౌండ్టేబుల్ సమావేశం విజయవాడలోని ఐవి ప్యాలస్లో జరిగింది. ఈ సమావేశానికి ప్రత్యేకహోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా టిడిపి, బిజెపి కలిసి రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాయని, దీన్ని ఐక్యంగా ఎదుర్కోవాలని రౌండ్ టేబుల్ సమావేశంలో సభ్యులు అభిప్రాయపడ్డారు. దీనికోసం ఐక్య ఉద్యమ కార్యాచరణ రూపొందించారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్షాలు,వైఎస్సార్ కాంగ్రెస్,జనసేన,కాంగ్రెస్,లోక్సత్తా,ఆప్,సమాజ్వాద్ పార్టీ,నవతరం పార్టీ,ఉత్తరాంధ్ర చర్చావేదిక, బార్ కౌన్సిల్, లారీ ఓనర్స్ అసోసియేషన్స్, రైతుసంఘం, విసికె పార్టీ,ఇండియన్ యూనియన్ ముస్లింలీగులతో పాటు ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, విద్యార్థి, యువజన సంఘాలు, పలు ప్రజాసంఘాల ప్రతి నిధులు పాల్గొన్నారు.
నేటి నుండి రోజూ...రౌండ్టేబుల్ సమావేశాలు
ఈనెల 19 నుండి మార్చి ఒకటో తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ రౌండ్టేబుల్ సమావేశాల్నినిర్వహించాలని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రౌండ్టేబుల్ సమావేశంలో నిర్ణయించింది. ఈ నెల 21న విజయవాడలో పోరాటానికి మద్దతుగా ఉద్యమాల గీతాలను ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకుంది. విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో మార్చి ఒకటో తేదీలోపు యూనివర్శిటీల్లో విద్యార్థులతో ప్రత్యేకహోదా,విభజన హామీల అమలు అంశంపై సదస్సులు...అదే రోజు విభజన హామీల అమలు అంశంపై గుంటూరులో సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు.
అందరి భాగస్వామ్యం...ఐక్యపోరాటం...
మార్చి 2,3,4 తేదీల్లో జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో దీక్షలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీనిలో అందరినీ భాగస్వాములను చేయాలన్నారు. మార్చి5 నుండి ఢిల్లీలో పార్లమెంటు ముందు నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. మరోవైపు ఇదే అంశంపై వివిధ సంఘాలు, పార్టీలు ఇచ్చిన ఆందోళనలకు ఉమ్మడిగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు.
పోరాటం...ఇతర రాష్ట్రాల్లోనూ...
ఈనెల 19న ఒంగోలులో ఎపిజెఎఫ్ నిర్వహించనున్న దీక్షకు, అలాగే ఈనెల 19 నుండి 28 వరకు కాంగ్రెస్ ఆత్మగౌరవ దీక్షలకు, 21న ఎపిడబ్ల్యుజెఎఫ్ నిర్వహించనున్న రౌండ్టేబుల్ సమావేశానికి, 25న చెన్నైలో ఎపిజెఎఫ్ నిర్వహించనున్న అవగాహనా సదస్సుకు ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి సభ్యులు మద్దతు ప్రకటించారు. 28న కర్నాటకలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అవగాహనా సదస్సుకూ మద్దతు తెలిపారు.
వరుస ఆందోళనలతో...ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడికి సైతం సై...
దీంతోపాటు మార్చి ఒకటోతేదీన వైసిపి ఆధ్వర్యంలో ఇదే అంశంపై జరగనున్న కలెక్టరేట్ల ముందు ధర్నాకు మద్దతు ప్రకటించారు. మార్చి 4న విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర చర్చావేదిక ఆధ్వర్యాన విశాఖ బీచ్లో నిర్వహించనున్న కొవ్వొత్తుల ర్యాలీ, మార్చి5 నుండి 10 వరకు ఢిల్లీలో జరిగే పార్లమెంటు ముట్టడి, అదేరోజు ఢిల్లీలో వైసిపి నిర్వహించే ధర్నా కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. మార్చి 6,7 తేదీల్లో కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో చేపట్టిన దీక్షకు, 8న నిర్వహించనున్న ఛలో పార్లమెంటుకూ మద్దతిచ్చారు. మార్చి 17న వికెసి పార్టీ అమలాపురంలో నిర్వహించనున్న చలో అమలాపురం కార్యక్రమానికి, ఏప్రిల్ 20న రాజమండ్రిలో జరిగే బహిరంగసభకూ ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రౌండ్టేబుల్ సమావేశం మద్దతు ప్రకటించింది.