చిరంజీవిని వదలని రాజకీయం - రాహుల్ తో "మెగా" అనుబంధం పై..!!
రాజకీయాలను తాను వదలిలేసినా.. రాజకీయం తనను వదలటం లేదు. ఇది గాడ్ ఫాదర్ లో చిరంజీవి డైలాగు. ఇప్పుడు వాస్తవంలోనూ అదే జరగుతోంది. తనకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని.. ఏపీలో తనకు ఓటు కూడా లేదంటూ చిరంజీవి తాజాగా స్పష్టం చేసారు. కానీ, చిరంజీవి రాజకీయ అనుబంధం ఇంకా కొనసాగుతోందని జాతీయ పార్టీ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా పని చేసిన చిరంజీవి.. రాష్ట్ర విభజన తరువాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. పార్టీకి రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల సమయంలోనూ చిరంజీవికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు మరోసారి చిరంజీవి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా - రాహుల్ తో సత్సంబంధాల పైన చర్చ తెర పైకి వచ్చింది.
మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి కాంగ్రెస్ తో దాదాపు తొమ్మదిళ్ల కాలంగా దూరంగా ఉంటున్నారు. పార్టీ పదవుల ఆఫర్ వచ్చినా తిరస్కరించారు. ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని నడిపించాలని ఢిల్లీ ముఖ్య నేతలు ఆహ్వానించారు. కానీ, చిరంజీవి అంగీకరించలేదు. ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయనతో సత్సంబంధాలు కొనసాగాయి. ఆ సమయంలోనూ చిరంజీవికి వైసీపీ నుంచి రాజ్యసభ ఇస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అందుకు చిరంజీవి స్పష్టత ఇచ్చారు. సినీ పరిశ్రమ అంశాలే మినహా.. తమ మధ్య రాజకీయ బంధం లేదని తేల్చి చెప్పారు. తాను ఏ పదవులు కోరుకోవటం లేదని క్లారిటీ ఇచ్చారు. తాను ఇప్పుడు పూర్తిగా సినిమాల గురించి ..సేవ గురించి మాత్రమే ఆలోచన చేస్తున్నానని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. చిరంజీవి కాంగ్రెస్ లోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. దీనికి కొనసాగింపుగా సోనియా, రాహుల్ గాంధీతో చిరంజీవి మంచి సంబంధాలు ఉన్నాయని రుద్రరాజు వివరించారు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ అన్ని స్థానాలకు పోటీ చేస్తుందని..ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేసారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలో మరోసారి చిరంజీవి పొలిటికల్ యాక్టివిటీ పైన చర్చ కు కారణమవుతున్నాయి. చిరంజీవి కాంగ్రెస్ కు రాజీనామా చేయలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సినిమాల కారణంగానే పార్టీకి దూరంగా ఉన్నారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రుద్రరాజు వ్యాఖ్యలతో మరోసారి చిరంజీవి - రాజకీయాలు అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.