సందడిగా విశాఖ ఎయిర్పోర్ట్: చైనా నుంచి స్వరాష్ట్రానికి తెలుగువారు: కరోనా వైరస్ నెగెటివ్గా తేలడంతో..
Recommended Video
విశాఖపట్నం: ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన చైనా నుంచి 35 మంది తెలుగువారు స్వరాష్ట్రానికి చేరుకున్నారు. న్యూఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖపట్నానికి వచ్చారు. ఈ సందర్భంగా విశాఖపట్నం విమానాశ్రయంలో కోలాహలం నెలకొంది. ఒకేసారి 35 మంది రావడం, వారి కోసం కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు విమానాశ్రయానికి చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. తమ వారికి వైరస్ సోకి ఉంటుందేమోననే భయంతో గడిపిన కుటుంబ సభ్యులు చివరికి ఊపిరి పీల్చుకున్నారు.
ఒక్క ఛాన్స్ ప్లీజ్..: ట్రంప్కు గుడి కట్టిన తెలంగాణ కుర్రాడు..కేంద్రానికి వేడుకోలు: ఎందుకుంటే!
రెండు వారాల కిందటే స్వదేశానికి వచ్చినా..
భయానక కరోనా వైరస్కు జన్మనిచ్చిన వుహాన్ సిటీ సహా హ్యుబే ప్రావిన్స్ నుంచి 600 మందికి పైగా భారతీయులను కేంద్ర ప్రభుత్వం రెండు ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తీసుకుని వచ్చింది. రెండు వారాల కిందటే వారంతా భారత్కు చేరుకున్నప్పటికీ.. వెంటనే స్వస్థలాలకు పంపించలేదు కేంద్ర ప్రభుత్వం. కరోనా వైరస్ జాడలు ఉండొచ్చనే ఉద్దేశంతో వారందర్నీ పరీక్షించడానికి ప్రత్యేకంగా క్వారంటైన్ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసింది.
నెగెటివ్గా తేలడంతో..
వుహాన్ సిటీ నుంచి వచ్చిన వారి కోసం ఈ క్వారంటైన్ శిబిరాల్లో ప్రత్యేకంగా వైద్య పరీక్షలను నిర్వహించారు. దశలవారీగా రక్త నమూనాలను సేకరించి, పుణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. మొత్తం ఎనిమిది దశల్లో ఈ వైద్య పరీక్షలు కొనసాగాయి. అన్ని వైద్య నివేదికలు నెగెటివ్గా రావడంతో దశలవారీగా వారందర్నీ స్వరాష్ట్రాలకు పంపిస్తున్నారు. ఏపీకి చెందిన వారు మొత్తం 68 మంది క్వారంటైన్ శిబిరాల్లో వైద్య పరీక్షలు పొందారు. తొలిదశలో 35 మందిని స్వరాష్ట్రానికి పంపించారు.
ఎక్కువ మంది విద్యార్థులే..
విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న వారిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. వారంతా వేర్వేరు విభాగాల్లో విద్యను అభ్యసించడానికి చైనాకు వెళ్లారు. ఈ 35 మందిలో 20 మంది విశాఖపట్నానికి చెందిన వారే. వారందర్నీ సురక్షితంగా ఇంటికి చేర్చడానికి విశాఖపట్నం జిల్లా అధికార యంత్రాంగం నోడల్ అధికారిని నియమించింది. ఈ బాధ్యతలను రెవెన్యూ అధికారి రాంబాబుకు అప్పగించింది. విశాఖపట్నం విమానాశ్రయంలో వారి వివరాలను తీసుకున్నారాయన.
అనారోగ్య సూచనలు కనిపిస్తే..
క్వారంటైన్ శిబిరాల నుంచి వచ్చిన వారికి అనారోగ్య సూచనలు కనిపిస్తే.. వెంటనే ఆసుపత్రికి సంప్రదించాల్సి ఉంటుందని నోడల్ అధికారి వెల్లడించారు. ఇప్పటికే కింగ్ జార్జి ఆసుపత్రి సహా కొన్ని ప్రధాన హాస్పిటల్స్లో ప్రత్యేక వార్డులను నెలకొల్పామని అన్నారు. వాటిల్లో పరీక్షించుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు వాటిని నెలకొల్పామని అన్నారు. క్వారంటైన్ శిబిరాల్లో దశలవారీగా పలుమార్లు కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించారని, అవన్నీ నెగెటివ్గా తేలాయని చెప్పారు.