కేంద్రంపై అవిశ్వాసం...ఏమవుతుంది:రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి
గుంటూరు: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం చేసే పోరాటంలో భాగంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై వైసిపి,టిడిపి ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసులు సోమవారం లోక్సభ స్పీకర్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ ఈ నెల 15న తొలిసారి అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వగా...తెలుగుదేశంపార్టీ ఆ మరుసటి రోజు మార్చి 16న తమ అవిశ్వాసం నోటీసు ఇచ్చింది.
సోమవారం ఎలాగైనా సభలో అవిశ్వాసంపై చర్చ జరిగేలా చూడాలని వైసిపి,టిడిపి పట్టుదలతో ప్రయత్నాలు జరుపుతున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వైసిపి,టిడిపి వేర్వేరుగా అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఏం జరగనుందనే విషయమై ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
సోమవారం...చర్చ జరుగుతుందా?...
కేంద్ర ప్రభుత్వంపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాసం తీర్మానానికి మద్దతు ఇవ్వాలని వైసిపి,టిడిపి దేశంలోని వివిధ పార్టీలను కోరాయి. అయితే సోమవారం లోక్ సభ స్పీకర్ ముందుకు వచ్చే ఈ అవిశ్వాస తీర్మానాలపై అసలు సభలో చర్చ జరుగుతుందా లేదా అనేది అత్యంత ఉత్కంఠకరంగా మారింది. సభ సజావుగా సాగితేనే అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంటుంది. సభలో ఏదేని కారణం వల్ల ఆందోళన రేగితే అవిశ్వాస తీర్మానాలపై చర్చ జరగదని స్పీకర్ కార్యాలయం ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
ఆందోళన జరిగే అవకాశాలు...తెరాసనే...
సభ లో ఆందోళన తలెత్తితే అవిశ్వాస తీర్మానంపై చర్చ ఉండదని స్పీకర్ కార్యాలయం స్పష్టం చేసిన నేపథ్యంలో...మరోవైపు సభలో ఆందోళన కొనసాగిస్తామని టిఆర్ ఎస్ చెబుతుండటం గమనార్హం. రిజర్వేషన్ల పెంపుతో పాటు విభజన హామీలు నెరవేర్చాలనే అంశాలపై సోమవారం కూడా లోక్ సభలో ఆందోళన కొనసాగించాలని తెరసా నిర్ణయించుకుంది. ఇక టిడిపి అవిశ్వాస తీర్మానానికి తృణమూల్ కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ప్రకటించగా,సభలో చర్చ జరిగితే అప్పుడు నిర్ణయం తీసుకోవాలని బిజెడి నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇక అన్నాడిఎంకే అవిశ్వాసానికి మద్దతు ఇచ్చేది లేదని తేల్చేసింది.
రాష్ట్రంలో...సర్వత్రా ఆసక్తి...
ఇక కేంద్రంపై వైసిపి, అవిశ్వాసం తీర్మానాల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. టిడిపి, వైసిపి పరస్పవ ఆరోపణల నేపథ్యంలో అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నందున్న...రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా అతి ముఖ్యమైనది అయినందున ప్రజలందరూ తాజా రాజకీయ పరిణామాలను అత్యంత ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. వాస్తవానికి ప్రత్యేక హోదాకు సంబంధించి రాష్ట్రప్రజలు టిడిపి-వైసిపిని దేనిని విశ్వసించే పరిస్థితుల్లో లేరని చెప్పుకోవచ్చు.కారణం టిడిపి ప్రత్యేక హోదాపై అనేక మాటలు మార్చగా...ఈ విషయమై టిడిపి అనేక యూ టర్న్ లు తీసుకోవడంతో విశ్వసనీయత దెబ్బతింది. ఇక వైసిపి తమకు ఇప్పటికి ప్రధాని మోడీపై విశ్వాసం ఉందంటూనే మరోవైపు అవిశ్వాస తీర్మానం పెట్టడం...ఇలా పెట్టే అవిశ్వాస తీర్మానం కేంద్రంపై ఏం ప్రభావం చూపగలుగుతుందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.
అయినా ఆశ...ప్రత్యేక హోదా కావాలనే ఆకాంక్ష
ఎపి అధికార పార్టీ,ప్రతిపక్ష పార్టీలు కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం అటు రాజకీయంగా...ఇటు రాష్ట్ర ప్రయోజనాల పరంగా అత్యంత ఆసక్తికరంగా మారింది. అయితే రాష్ట్రప్రజలు ఈ తరుణంలో రాజకీయాలకు సంబంధించి ఏమి జరిగినా పర్లేదు కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే చాలనుకుంటున్నారు. అందుకోసమే ఏం జరుగుతుందనే విషయం ఆరా తీస్తున్నారు. రాజకీయపరంగా రాష్ట్ర ప్రజల్లో అత్యధికులు ఇంత చైతన్యంగా ఉన్న పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదంటున్నారు రాజకీయ పరిశీలకులు...ఎపికి సంబంధించి అతికీలకమైన పరిణామం ఏ మలుపు తిరుగుతుందో మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.