ఫోన్ ట్యాపింగ్: ఢిల్లీలో విజయసాయిరెడ్డి లాబీయింగ్ - డీజీపీపైనా టీడీపీ విసుర్లు - గంటకో ట్విస్ట్..
ఆంధ్రప్రదేశ్ లో ఫోన్ ట్యాపింగ్ వివాదంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రెండు పార్టీలకు చెందిన నేతలు వరుసగా ప్రెస్ మీట్లు, ట్వీట్లు పెడుతుండటంతో గంటగంటకో ట్విస్టు చోటుచేసుకుంటున్నది. ఫోన్ ట్యాపింగ్స్ పై దర్యాప్తు చేయించాలంటూ చంద్రబాబు.. ప్రధాని మోదీ, కేంద్ర టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు లేఖలు రాసిన నేపథ్యంలో ఏపీ సర్కారుపై చర్యలు తప్పవంటోన్న టీడీపీ.. దాన్నుంచి తప్పించుకునేందుకు జగన్ పార్టీ లాబీయింగ్ మొదలుపెట్టిందని ఆరోపించింది. మరోవైపు హైకోర్టులోనూ ఈ అంశంపై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
నారా లోకేశ్ మానభంగం చేశారంటే ఊరుకుంటారా? చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సుచరిత కౌంటర్
ఢిల్లీలో సాయిరెడ్డి లాబీ..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్రానికి ఫిర్యాదు చేశారనే దుగ్ధతో చంద్రబాబుపై అధికార పార్టీనేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్న టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరో అడుగుముందుకేసి ఢిల్లీలో సీన్ తారుమారు చేసేందుకు వైసీపీ యత్నిస్తోందని ఆరోపించారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారని చెప్పుకొచ్చారు. ‘‘ఫోన్ టాంపరింగ్ పై విజయసాయిరెడ్డి ఢిల్లీ లాబీయింగ్ ను మొదలు పెట్టటం నిజం కాదా? తమను ఈ కేసు నుంచి ఎలాగైనా బయట పడేయాలని ఢిల్లీ ముఖ్యులకు ఆయన ఫోన్లు చేసి ఎందుకు వేడుకుంటున్నారు?'' అని వెంకన్న ప్రశ్నించారు. అంతకుముందు..
స్వయంగా నా ఫోన్ ట్యాప్ చేశారు..
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చంద్రబాబు తీరు దొంగోడే దొంగా దొంగా అని అరిచినట్లుగా ఉందని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ‘‘చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు స్వయంగా నా ఫోన్ ట్యాప్ చేశారు. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా కోర్టుకు సమర్పించాం. బాబు ప్రజాక్షేత్రం నుంచి వచ్చిన నాయకుడు కాదు గనుక కుట్రలుచేయడం, క్యాంపు రాజకీయాలు నడపడం, అడ్డదారుల్లో నడవడం బాగా అలవాటు. అదే సీఎం జగన్ ది మాత్రం ఎప్పుడూ ముక్కుసూటి రాజకీయమే. ఇప్పుడున్నది ప్రజా ప్రభుత్వం. ఏం చేసినా రాజమార్గమే''అని సజ్జల పేర్కొన్నారు. అయితే, నిజంగా ఆధారాలుంటే, కోర్టు నుంచి కేసులు ఎందుకు విత్ డ్రా చేసుకున్నారో చెప్పాలని సజ్జలకు బుద్దా వెంకన్న సవాలు విసిరారు.
డీజీపీ తీరు అభ్యంతరకరం..
ట్యాపింగ్ అంశంపై దర్యాప్తు చేపట్టాలంటూ చంద్రబాబుకు కేంద్రాన్ని కోరగా.. దానికి సంబంధించిన ఆధారాలుంటే పంపాలంటూ ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ అనూహ్యంగా టీడీపీ అధినేతకు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. అయితే డీజీపీ తీరు అభ్యంతరకరంగా ఉందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య అన్నారు. ఆధారాలు ఇస్తేనే దర్యాప్తు చేస్తామన్నట్లు వ్యవహరించడం సరికాదని, చంద్రబాబు లేఖ, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా పోలీసులు సుమోటోగా కేసు ఎందుకు నమోదు చేయకూడదని వర్ల ప్రశ్నించారు. అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా? అని నిలదీశారు.
‘బ్రీఫుడు మీ'అన్నది బాబే కదా..
ఏపీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారన్న టీడీపీ ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించాల్సి ఉంది. అయితే ఇదే వ్యవహారానికి సంబంధించి చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పించారు. నాటి ఓటుకు నోటు వ్యవహారాన్ని గుర్తుచేస్తూ.. ‘‘మనవాళ్లు బ్రీఫుడు మీ.. అన్న వాయిస్ చంద్రబాబుదేనని పసిపిల్లలు కూడా గుర్తుపట్టారు. ఆ సందర్భంలో.. ‘నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఎవరిచ్చారంటూ' మీడియా ఇంటర్వ్యూల్లో బాబు గద్దింపులకు దిగిన విషయాన్ని ఎవరూ మర్చి పోలేదు. ఇజ్రాయిల్ ట్యాపింగ్ మిషన్ల కోసం కింద మీదా పడ్డట్టు వికీలీక్స్ బయట పెట్టింది. దొంగే దొంగని అర్చినట్టు లేదూ?''అని సాయిరెడ్డి అన్నారు.
వెనక్కి తగ్గని హీరో రామ్ పోతినేని - మరింత గట్టిగా ఎదురుదాడి - ఈసారి కులం పేరుతోనే