బిజెపి ఎంపీ హరిబాబు డాక్యుమెంటరీ చూపాడు: కుటుంబరావు
అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కేంద్రప్రభుత్వాన్ని లెక్కలు అడగాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మెన్ సి. కుటుంబరావు కోరారు. బిజెపి ఎంపీ హరిబాబుపై కుటుంబరావు నిప్పులు చెరిగారు.కేంద్రం ప్రత్యేక సహయం కింద ఇస్తానని ప్రకటించిన రూ.16,447 కోట్లు ఇవ్వనేలేదన్నారు కుటుంబరావు.
ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి నిధుల విషయమై బిజెపి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కుటుంబరావు విమర్శించారు.
శుక్రవారం నాడు కుటుంబరావు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. కేంద్రం నుండి రాష్ట్రానికి ఏ మేరకు నిధులొచ్చాయనే విషయమై రాష్ట్రాన్ని అడిగినట్టుగానే కేంద్రాన్నికూడ నిధులను అడగాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్కు కుటుంబరావు సూచించారు.
మొన్న విశాఖ ఎంపీ హరిబాబు సినిమా స్క్రిప్ట్ చదివితే ఇవాళ ఏకంగా డాక్యుమెంటరీ చూపాడని కుటుంబరావు ఎద్దేవా చేశారు. ఏపీకి ఇస్తానని ఇచ్చిన హమీలను కేంద్ర ప్రభుత్వం ఇంకా నెరవేర్చలేదన్నారు.
వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ350 కోట్లను కేంద్ర ప్రభుత్వం తిరిగి వెనక్కు తీసుకొందని కుటుంబరావు చెప్పారు.14వ, ఆర్థిక సంఘం సిఫారసుల పేరుతో నిధుల్లో కోత విధించారని కుటుంబరావు చెప్పారు. విభజనతో నష్టపోయిన ఏపీ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని కుటుంబరావు కోరారు.
ఆర్ధిక లోటు గురించి బిజెపి ఎంపీ హరిబాబు ఎందుకు ప్రస్తావించలేదని కుటుంబరావు ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎంపీ ప్రస్తావించకపోవడంలో మర్మమేమిటని కుటుంబరావు ప్రశ్నించారు.