ఎపి:కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ నేడే...2,803 కొలువులకు ప్రకటన
అమరావతి:ఒంటి మీద పోలీస్ యూనిఫామ్ పడాలంటూ కలలు కనే యువకులకు ఏపీ పోలీస్ నియామక బోర్డు శుభవార్త రానుంది. 2,803 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సోమవారం ఏపీ పోలీస్ నియామక బోర్డు ప్రకటన జారీ చేయనుంది.
ఈ నోటిఫికేషన్ సోమవారం మధ్యాహ్నం నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నట్లు తెలిసింది. అలాగే నోటిఫికేషన్తో పాటు వెబ్సైట్ నుంచి అప్లికేషన్ల డౌన్ లోడ్ కూడా సోమవారం మధ్యాహ్నం నుంచే అవకాశం కల్పిస్తున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు తెలిపారు. పోస్టులకు డిసెంబరు 7 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని సమాచారం.
కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఓసీ, బీసీలు అయితే రూ.300, ఎస్సీ, ఎస్టీలైతే రూ.150 అప్లికేషన్ ఫీజును ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. ఇంటర్మీడియెట్ తత్సమాన విద్యార్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2018 జూలై 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు అర్హులు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ముగిసిన అనంతరం అర్హులైన అభ్యర్థులకు డిసెంబరు 24 నుంచి జనవరి 4 వరకు ఆన్లైన్లోనే హాల్ టికెట్లను జారీ చేస్తారు.
ముందుగా జనవరి 6 వ తేదీన ప్రాథమిక పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. గతంలో లాగా కాకుండా తొలుత రాత పరీక్షను నిర్వహించి, అర్హులను దేహదారుఢ్య పరీక్షలకు ఎంపిక చేయడం...ఐదు కిలోమీటర్ల రన్నింగ్ కాంపిటీషన్ రద్దు...క్వాలిఫయింగ్ ఈవెంట్స్ను ఐదు నుంచి మూడింటికి పరిమితం చేయడం లాంటి సంస్కరణలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈసారి రిక్రూట్ మెంట్ ప్రక్రియలో ఇదే విధానం అనుసరించనున్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి గరిష్ఠంగా 5 నెలల వ్యవధిలో నియామక ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఏపీ పోలీస్ నియామక బోర్డు జారీ చేయనన్న పోలీసు కొలువుల వివరాలు ఇవీ...సివిల్ పోలీసు కానిస్టేబుల్ 1,600; ఏఆర్ కానిస్టేబుల్ 300; ఏపీఎస్పీ కానిస్టేబుల్ 300; ఫైర్మెన్ 400; జైలు వార్డర్(పురుషులు) 100; జైలు వార్డర్(మహిళలు) 23; డ్రైవర్లు 30; అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 50.