తుని విధ్వంసకాండ: మీ వద్ద సమాచారం ఉందా?, వాట్సాప్ నెంబర్ ఇదే
తుని: తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన సభ అనంతరం చోటు చేసుకున్న హింసాత్మాక ఘటనకు బాధ్యులైన వారిలో చాలా మంది పోలీసులను గుర్తించారు. మరోవైపు ఈ దాడి ఘటనకు సంబంధించి, ఏమైనా వీడియోలు, ఫోటోలు, ఇతర ఆధారాలు ఉంటే అందించాలని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్ విజ్ఞప్తి చేశారు.
పెట్రోలు, రాడ్లు, కర్రలు, కత్తులు ముందస్తుగా తెచ్చి ఎక్కడ దాచిపెట్టారు, పెట్రోలు ఏ వాహనాలలో ఎక్కడ నుంచి తీసుకువచ్చారు..? వంటి అంశాలపైనా దృష్టిని కేంద్రీకరించామన్నారు. దాడికి పాల్పడినవారిలో ముఖ్యులను ఇప్పటికే గుర్తించామని, మరికొంతమందిని గుర్తించేపనిలో ఉన్నామన్నారు.
రత్నాచల్ ఎక్స్ప్రెస్, పోలీస్ స్టేషన్లపై ఒకే పద్ధతిలో దాడి జరగడంతో పక్కా ప్రణాళికతోనే దాడులు జరిగినట్టు పోలీసు వర్గాలు భావిస్తున్నాయని ఓ పోలీసు ఉన్నాతాధికారి ఒకరు వెల్లడించారు. 300 మందికి పైగా నిందితులను గుర్తించామని తుని రూరల్ సీఐ చెన్నకేశవరావు తెలిపారు. బాధ్యులపై పలు యాక్టుల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు.
తుని ఘటన వెనుక అన్ని జిల్లాల వారూ ఉన్నారన్నారు. మరోవైపు ‘తుని' విధ్వంసకాండ బాధ్యులెవరినీ వదలమని రాష్ట్ర డీజీపీ రాముడు హెచ్చరించారు. రాజమండ్రి పోలీసు గెస్ట్హౌ్సలో బుధవారం ఆయన అడిషనల్ ఐజీ కుమార్ విశ్వజిత్, ఏలూరు రేంజ్ డిఐజీ హరికుమార్, కాకినాడ, రాజమహేంద్రవరం ఎస్పీలు రవిప్రకాశ్, హరికృష్ణలతో 4 గంటలపాటు సమీక్షించారు.
తుని ఘటన అనంతర పరిణామాలపై, ముఖ్యంగా శుక్రవారం నుంచి మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షపై ప్రధానంగా చర్చించారు. గాయపడ్డ పోలీసులను పరామర్శించారు. ‘‘మీరూ మీకు తెలిసిన వివరాలు ఇవ్వండి'' అని మీడియా ప్రతినిధులను డీజీపీ కోరారు.
తుని హింసాత్మక ఘటనకు సంబంధించిన సమాచారం ఇవ్వాలనుకునే వారికోసం వాట్స్ యాప్ నంబర్, ఈమెయిల్ ఐడీ ఏర్పాటు చేసినట్టు అడిషనల్ ఐజీ కుమార్ విశ్వజితసింగ్ వెల్లడించారు. వాట్సప్కు సమాచారం ఇవ్వాలనుకునేవారు 9440904859 నంబర్లో సంప్రదించాలన్నారు.
రైలు బాధితులు, మీటింగ్లో ఇబ్బంది పడ్డవాళ్లు, మీడియాతోపాటు ఎవరైనా ఈ నంబరుకు ఫోన్ చేయొచ్చునని తెలిపారు. అలాగే [email protected] అనే వెబ్సైట్కు కూడా సమాచారం ఇవ్వవచ్చన్నారు. వారి వివరాలన్నీ గోప్యంగా ఉంచుతామన్నారు.