తిరుమలలో బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం, కిడ్నాపర్ అరెస్ట్ బాలుడు సేఫ్
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమలలో కిడ్నాప్కు గురైన బాలుడు వీరేష్ ఆచూకీ ఆదివారం లభ్యమైంది. మహారాష్ట్రలో పోలీసులు చిన్నారిని గుర్తించారు. శుక్రవారం వేకువజామున బాలుడు కిడ్నాప్కు గురయ్యాడు. సోషల్ మీడియా ప్రచారం ద్వారా స్థానికులు వీరేష్ను గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్నారు.
చిన్నారి వీరేష్ మామనూరు పోలీసుల సంరక్షణలో ఉన్నాడు. నాందేడ్ నుంచి నిందితుడిని తీసుకు వచ్చేందుకు ఏపీ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. క్రైమ్ సీఐ సుబ్రహ్మణ్యం తిరుపతి నుంచి నాందేడ్ బయలుదేరారు.
రెండు రోజుల క్రితం తిరుమల కొండపై పదహారు నెలల బాలుడు వీరేష్ కిడ్నాప్కు గురయ్యాడు. ఫిర్యాదు అందగానే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాల ద్వారా బాలుడి కోసం గాలించారు. మరోవైపు మీడియా, సోషల్ మీడియాలోను ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల ద్వారా బాలుడిని, నిందితుడిని ఆదివారం ఉదయం మహారాష్ట్రలోని లాతూరులో గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఏపీ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో నిందితుడిని తీసుకొచ్చేందుకు పోలీసులు బయల్దేరారు.