AP Police : పంచాయతీ పోరులో మానవత్వం- వృద్ధులు, దివ్యాంగులకు సాయం
ఏపీలో ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల తొలిదశ పోలింగ్ జరుగుతోంది. ఇందులో జనం పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. చాలా జిల్లాల్లో ఓటింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. అయితే పలు చోట్ల ఓటు హక్కు కలిగిన వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్ కేంద్రాలకు నడిచి వెళ్లలేక ఇబ్బందులు కూడా పడుతున్నారు. దీంతో పోలీసులు మరోసారి రంగంలోకి దిగి తమ ఔదార్యం చాటుకుంటున్నారు.
Recommended Video
పలు జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లలేక వృద్ధులు, వికలాంగులు ఇళ్ల వద్దకే పరిమితం అవుతున్నారు. ఓటు హక్కు ఉండి కూడా పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేక ఇలా ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి వారికి సాయం చేసేందుకు ఏపీ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆయా వర్గాల వారికి ఇది ఎంతో ఊరట నిస్తోంది. ఇళ్ల వద్ద నుంచి పోలింగ్ కేంద్రాల వరకూ వెళ్లగలిగిన వారికి తోడుగా ఉండి సాయం చేయడంతో పాటు వెళ్లలేని వారిని మోసుకెళుతూ పోలీసులు ఆదర్శంగా నిలుస్తున్నారు.
తాజాగా శ్రీకాకుళం జిల్లాలో గుర్తుతెలియని మృతదేహాన్ని మోసుకెళ్లిన మహిళా ఎస్సై శిరీష ఘటన మర్చిపోకముందే పంచాయతీ పోరులో ఏపీ పోలీసులు చూపుతున్న ఔదార్యం పలుచోట్ల వారికి ప్రశంసలు కురిపిస్తోంది. పలుచోట్ల మహిళా పోలీసుల సాయంతోనే మహిళా ఓటర్లను బూత్లకు తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలకు చేరువయ్యేందుకు ఏపీ పోలీసు శాఖ వరుసగా చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు కారణంగా కనిపిస్తోంది.