ఎటిఎం క్లోనింగ్ గ్యాంగ్ ని అరెస్ట్...ఆంధ్రాలో ఆరంగ్రేటం చేసిన అంతర్జాతీయ నేరస్తులు
చిత్తూరు జిల్లా: ఎటిఎం కార్డు వినియోగదారులారా...తస్మాత్ జాగ్రత్త...ఎటిఎం కార్డు వాడకంలో మీరు గతంలో కంటే మరింత అప్రమప్తంగా వ్యవహరించాల్సిన సమయం వచ్చేసింది. ఈ హెచ్చరిక దేనికంటారా? టెక్నాలజీ ఉపయోగించి ఎటిఎం కార్డులు క్లోన్ చేసి డబ్బు దోచుకునే అంతర్జాతీయ క్రిమినల్ ముఠాలు ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఆరంగ్రేటం చేశాయి.
ఎపిలో అడుగుపెట్టడమే కాదు ఏకంగా కొద్ది సమయం వ్యవధిలోనే 12 లక్షల రూపాయలు కొల్లగొట్టేశాయి. అయితే క్రిమినల్స్ మరింత రెచ్చిపోకముందే చిత్తూరు పోలీసులు అప్రమప్తంగా వ్యవహరించి ఈ ఎటిఎం క్లోనింగ్ రాబరీ గ్యాంగ్ ను పట్టేశారు. చేతిలో కార్డు చేతిలో ఉండగానే ఎటిఎం లో డబ్బులు మాయమైపోతుండటంతో లబోదిబో మంటూ ఖాతాదారులు పోలీసులను ఆశ్రయంచడంతో ఈ క్రిమినల్స్ గుట్టు బైటపడింది. వివరాల్లోకి వెళ్లితే....
క్రిమినల్స్ గుట్టు రట్టయింది...
చిత్తూరు జిల్లా పలమనేరులో ఇటీవల ఒకే బ్యాంకుకు చెందిన 22 మంది ఖాతాదారుల అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు విత్ డ్రా అయింది. ఆ డబ్బును ఖాతాదారులే ఎటిఎం కార్డు ద్వారా డ్రా చేసినట్లు నమోదయింది. అయితే తాము డబ్బు తీయకుండానే తమ ఎటిఎం కార్డు తమ దగ్గర ఉండగానే ఈ చోరీ జరగడంతో ఖాతాదారులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ విషయాన్నిసీరియస్ గా తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారు. ముఖ్యంగా డీఎస్పీ చౌడేశ్వరి ఈ కేసు విషయంలో ప్రత్యేక శ్రద్ద కనబరిచి పోలీసులకు దిశానిర్ధేశం చేశారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు ఐడీపార్టీ పోలీసులతో కలిసి పలమనేరులో అమర్చిన సీసీటీవీ పుటేజీలు, కాల్డేటా ద్వారా నేరస్తుల ఆచూకి ఆనవాళ్ల కోసం అన్వేషణ సాగించి చివరకు నేరగాళ్లను గుర్తించారు. వీరి మొబైల్ నంబర్లను ట్రేస్ చేసి సెల్టవర్ లొకేషన్ ద్వారా వీరి కదలికలను పసిగట్టారు. చివరకు శనివారం పలమనేరు ఏఎంసీ చెక్పోస్టు వద్ద దుండగులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.12,12,619 నగదు తో పాటు క్లోనింగ్కు ఉపయోగించే స్కైమర్, కార్డు రీడర్లు, డాటా మేనేజర్ సాఫ్ట్వేర్, మైక్రో సీసీ కెమెరాలు, డమ్మీ ఏటీఎం కార్డులు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు.
ఎటిఎం క్లోనింగ్ ముఠా వివరాలు
అనంతరం విచారణలో వారు తమిళనాడు రాష్ట్రం కనత్తూరుకు చెం దిన నిరంజన్(37), మొహిద్దీన్(25), మాఘపూర్కు చెందిన ఎంఎస్కే రక్షిత్ అలియాస్ శ్యామ్(28), శాలిగ్రంకు చెందిన సురేష్(26), క్రిష్ణగిరికి చెందిన తమిళరసన్(25)గా తేలింది. వీరితో పాటు శ్రీలంకకు చెందిన ఆల్ఫ్రెడ్ బాలకుమార్, ముంబయికి చెందిన ఉమేష్ ప్రమేయం ఉందని గుర్తించారు. వీరు పలమనేరులోని ఎస్బీఐ ఏటీఎంతో బాటు తమిళనాడులోనూ ఇలాంటి చోరీలు చేసినట్టు ఎస్పీ తెలిపారు.
పరారీలో అసలు దొంగలు...
అయితే ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న వారేకాక మరో ఇద్దరు కీలకమైన నిందితుల ప్రమేయం కూడా ఉందని వారిదే ఈ దొంగతనాల్లో కీలకపాత్ర అని పోలీసుల విచారణలో తేలింది. ముఖ్యంగా ఎటిఎం కార్డు క్లోనింగ్ చేశాక డమ్మీ ఏటీఎం కార్డులను వీరు ఎక్కడి నుంచి తెచ్చారనేది ఇంకా తేలాల్సి ఉంది. శ్రీలంకు చెందిన ఆల్ఫ్రెడ్, ముంబయికి చెందిన ఉమేష్ బయటి దేశాల రికితే నుంచే వీటిని సంపాదించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరిద్దరూ దొరికితే మరింత కీలక సమాచారం లభిస్తుందని ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు.
దోపిడి ఎలా చేశారంటే...
నిందితుల్లో ఎక్కువమంది బాగా చదువుకున్నవారు. సులభ సంపాదన ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో తప్పుదారి పట్టారు. ఎటిఎం క్లోనింగ్ గురించి మీడియా ద్వారా తెలుసుకొని అతి తక్కువ సమయంలో ఎక్కువమొత్తం సంపాదించాలంటే ఆ పనే చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంకేముంది కావాల్సిన సమాచారం సేకరించి తమకు అవసరమైన వారితో ముఠాగా ఏర్పడి పని ప్రారంభించారు. సెక్యూరిటీలేని ఏటీఎం సెంటర్ లను గుర్తించడం , వాటిల్లోకి ప్రవేశించి ఏటీఎం యంత్రాన్ని విప్పి అందులో స్కైమర్ అనే యంత్రాన్ని అమర్చుతారు. ఇందులో కార్డు రీడర్ ఉంటుంది. ఏటీఎం పిన్ కనిపించేలా క్యాబిన్లో ఓ మైక్రో సీసీ కెమెరాను వీరే ఏర్పాటు చేస్తారు. స్కైమర్ ద్వారా ఏటీఎం కార్డు డేటా వీరి ల్యాప్ట్యాప్లకు చేరుతుంది. వీరి వద్ద ఉన్న డూప్లికేట్ ఏటీఎం కార్డులకు ఖాతాదారుల వివరాలను జోడించి సీసీ కెమెరాలో కనిపించిన ఏటీఎం పిన్ ద్వారా స్వైపింగ్ మిషన్లతో నగదును డ్రా చేసేస్తారు. అంతే పని పూర్తయిపోతుంది.
రాష్ట్రంలోనే మొదటి క్లోనింగ్ దోపిడి....
గత ఏడాది మన దేశంలో తొలిసారిగా ఢిల్లీలో ఇదే తరహా దోపిడీ జరిగింది. ఆ తరువాత హైదరాబాద్లో జరిగింది. అయితే మన రాష్ట్రంలో మాత్రం ఇదే తొలి ఎటిఎం క్లోనింగ్ దోపిడీ కేసు. మరో దోపిడీకి పాల్పడేందుకు ఈ గ్యాంగ్ ఇటీవలే గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎటిఎం కార్డుల సమాచారం సేకరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. చిత్తూరు ఎస్పీ ఆదేశాలతో స్థానిక డీఎస్పీ చౌడేశ్వరి, సీఐ వెంకట్వేర్లు ఐడీ పార్టీతో కలిసి ఈ కేసును సవాల్గా తీసుకున్నారు. రెండు నెలల వ్యవధిలో తీవ్రంగా శ్రమించి ఈ హైటెక్ దొంగల ముఠాను పట్టుకున్నారు. దీంతో ఎస్పీ ఎస్పీ రాజశేఖర్ బాబు ఈ గ్యాంగ్ ను పట్టుకోవడానికి కృషి చేసిన డిఎస్పీ చౌడేశ్వరిని ప్రశంసించడంతో పాటు ఈ కేసు చేధిచడంలో కృషి చేసిన సిబ్బంది దేవ, జయక్రిష్ణ, శీన, ప్రకాష్, ఎల్లప్ప, పయణి, శివ, అల్లాఉద్దీన్, ప్రకాష్కు రివార్డులను అందించారు.