కంచ ఐలయ్యకు ఏపీ పోలీసులు షాక్, నోటీసులు: సభపై తగ్గిన ఆర్యవైశ్య సంఘాలు
రచయిత కంచ ఐలయ్యకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు శుక్రవారం నోటీసులు ఇచ్చారు. తార్నాకలోని ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
అమరావతి: రచయిత కంచ ఐలయ్యకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు శుక్రవారం నోటీసులు ఇచ్చారు. తార్నాకలోని ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
చదవండి: వైశ్యులతో తగవుకోసం కాదు, ఏపీని పాలిస్తోంది అంబానీయా: బెజవాడలో ఐలయ్య టెన్షన్
విజయవాడ డీసీపీ క్రాంతి రాణా పేరుతో ఆ నోటీసులు జారీ అయ్యాయి. విజయవాడలో ఈ నెల 28న నిర్వహించతలపెట్టిన కంచ ఐలయ్య సంఘీభావ సభకు అనుమతిలేదని చెప్పారు. అలాగే, ఆర్యవైశ్య సభకు కూడా అనుమతి లేదు.
మరోవైపు, విజయవాడ జింఖానా మైదానంలో శనివారం నిర్వహించనున్న సభలకు అనుమతి లేదని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ తెలిపారు. కంచ ఐలయ్య, ఆర్య వైశ్య బ్రాహ్మణ ఐక్యవేదిక సభలకు ఎవరొచ్చినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
సభలకు అనుమతి నిరాకరించినందున విజయవాడకు తరలిరావద్దన్నారు. పోటాపోటీ వ్యాఖ్యలు చేసిన ఇరువర్గాల్లోని 290 మందికి నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. విజయవాడ నగరంలో సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉన్నట్టు తెలిపారు. జింఖానా మైదానం సహా వివిధ ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కేసులు నమోదుచేసి కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
ఆర్యవైశ్య ప్రతిఘటన
ఆ రోజు ఆర్యవైశ్య ప్రతిఘటన సభ ఉందని స్పష్టం చేశారు. ఆ రోజే రెండు వర్గాలు సభలు నిర్వహించడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని నోటీసుల్లో పేర్కొన్నారు. సభ జరిగితే అసాంఘీక శక్తులు చొరబడే అవకాశముందన్నారు. ఇరు సభలకు అనుమతించలేదు.
నా ఆరోగ్యం బాగానే ఉంది
సభకు అనుమతి నిరాకరణపై కంచ ఐలయ్య స్పందించారు. అసాంఘిక శక్తులు అని ఎవరిని అంటున్నారని ప్రశ్నించారు. తమ వద్ద అసాంఘిక శక్తులు ఎవరూ లేరన్నారు. తాము చట్టాన్ని గౌరవిస్తామని చెప్పారు. తన ఆరోగ్యం బాగా లేదని వార్తలు వస్తున్నాయని, తాను బాగానే ఉన్నానని చెప్పారు.
సభ నిర్వహిస్తామని ప్రకటన
నేను విజయవాడ వెళ్లకుండా తనపై కుట్ర జరుగుతోందని కంచ ఐలయ్య అన్నారు. రాజకీయ కుట్ర జరుగుతోందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు సభ నిర్వహిస్తామని కంచ ఐలయ్య అనుకూలురు అయిన సాంబశివరావు ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో సభ ఉంటుందన్నారు. మరోవైపు కంచ ఐలయ్య నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
సభను విరమించుకున్న వైశ్య, బ్రాహ్మణ సంఘాలు
మరోవైపు, కంచ ఐలయ్య రచనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆర్య వైశ్య, బ్రాహ్మణ సంఘాలు తమ విజయవాడ సభను విరమించుకున్నాయి. కంచ ఐలయ్య సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో వారు కూడా విరమించుకున్నారు. ఐలయ్య సభను నిర్వహిస్తే తాము మాత్రం కచ్చితంగా నిర్వహిస్తామన్నారు. కాగా, కంచ ఐలయ్య హిందూమతాన్ని టార్గెట్ చేస్తూ రచనలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల కోమట్లపై విషపూరిత పుస్తకం రాశారని వైశ్య సంఘాలు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మండిపడుతున్నారు.
ఆర్యవైశ్యులు ద్రావిడులు కాదని నిరూపించగలరా
ఆర్యవైశ్యులు ద్రవిడులు కాదని నిరూపిస్తే, తాను ఆత్మహత్య చేసుకుంటానని టిజి వెంకటేష్ అంతకుముందు కంచ ఐలయ్యకు సవాల్ విసిరారు. ఉత్తర భారతదేశంలోని బనియా సంపన్నులతో ఆర్యవైశ్యులను పోల్చడం సరికాదన్నారు. ఐలయ్య రాసిన పుస్తకంపై పిటిషన్ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేయలేదని, కేవలం డిస్పోజ్ మాత్రమే చేసిందన్నారు. త్వరలోనే ఈ కేసు మళ్లీ విచారణకు రానుందన్నారు.
మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి కాలం
కులాల మధ్య చిచ్చు పెడుతూ కాలం గడుపుతున్న ఐలయ్య... వెనకబడిన కులాలకు ఏం చేశారో చెప్పాలని టీజీ వెంకటేష్ డిమాండ్ చేశారు. అమెరికాలాంటి సామ్రాజ్యవాద దేశాలకు ఐలయ్య వత్తాసు పలుకుతున్నారని, అలాంటి వ్యక్తికి కమ్యూనిస్టులు మద్దతు పలకడం ఎంతవరకు సమంజసమన్నారు.