పోలీసులకు కులమతాలు ఆపాదిస్తారా ? ఇదేనా 40 ఏళ్ల అనుభవం- చంద్రబాబుపై సంఘం ఫైర్
ఏపీలో ఆలయ ఘటనల నేపథ్యంలో పోలీసులు మరోసారి రాజకీయ పార్టీలకు టార్గెట్గా మారారు. ఆలయాల్లో విగ్రహాల విధ్వంసం జరుగుతుంటే పోలీసులు వాటిని సమర్దంగా అడ్డుకోలేకపోతున్నారని ఓసారి, గుళ్ల సందర్శనకు వెళ్తున్న విపక్ష నేతలను అడ్డుకుంటున్నారన్న ఆరోపణలతో మరోసారి పోలీసులపై పలు రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి. దీంతో తమపై వస్తున్న ఆరోపణలపై పోలీసు అధికారుల సంఘం ఇవాళ తీవ్రంగా స్పందించింది.
కొంతమంది రాజకీయ నాయకులు దురుద్దేశపూరితంగా ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్లు పోలీసు అధికారుల సంఘం ప్రకటించింది. కుల, మత భేదాలు లేకుండా ప్రజల సేవకై నిరంతరం పాడుపడుతూ విధులు నిర్వర్తిస్తున్నామని సంఘం తెలిపింది. మా మతం, కులం ఖాకీయేనని, మానవతా విలువలతో కూడిన ప్రజాసేవ మా బాధ్యతని పోలీసు అధికారుల సంఘం పేర్కొంది. రాజ్యాంగాన్ని, చట్టాలను మేం భవద్గీత, ఖురాన్, బైబిల్గా భావిస్తామని తెలిపింది. స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం మతప్రమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడం, వాటిని పోలీసులకు ఆపాదించడం దేనికి సంకేతమని సంఘం ప్రశ్నించింది.
సీఎం, హోంమంత్రితో పాటు డీజీపీ కూడా క్రైస్త్రవుడే అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన విమర్శలపై పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా స్పందించింది. బౌద్ధులు, సిక్కులు, క్రైస్తవులు వంటి సర్వమత కలయిక పోలీసు శాఖ అని తెలిపింది. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గౌరవ నాయకుడు పోలీసులను కులమత దృక్పథంతో పోల్చడం ఎంతవరకూ సమంజసమని చంద్రబాబును ప్రశ్నించింది. కరోనాపై జరిగిన యుద్ధంలో 109 మంది పోలీసులు రాష్ట్రంలో ప్రజల కోసం ప్రాణాలర్పించారని సంఘం గుర్తు చేసింది.