రవి కిరణ్ ఇష్యూలో ట్విస్ట్: వైసిపి ఆఫీస్లో సోదాలు, ఆట ఇప్పుడే మొదలు
రవి కిరణ్ను వదిలేసిన పోలీసులు శనివారంనాడు వైసిపి కార్యాలయంలోని ఐటి వింగ్లో సోదాలు నిర్వహించారు. దీన్ని బట్టి ఆట ఇప్పుడే మొదలైందని అర్థమవుతోంది.
హైదరాబాద్: పోలిటికల్ పంచ్ ఫేస్బుక్ పేజీలో పెట్టిన పోస్టుపై అరెస్టు చేసిన ఇంటూరి రవికిరణ్ కథ ముగిసిపోలేదు. రవి కిరణ్పై తూళ్లూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైనట్లు పోలీసులు జాతీయ మీడియాకు అధికారికంగా చెప్పారు. గుంటూరు రూరల్ ఎస్పీ ఆ విషయం చెప్పారు. ఈ నెల 25వ తేదీన స్టేషన్కు రావాలని పోలీసు రవికిరణ్కు చెప్పారు.
మూడు కాగితాలపై ఆయనతో సంతకాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏమైందో తెలియదు గానీ అతన్ని తిరిగి ఇంటి వద్ద వదిలేసి పోయారు. దాంతో కేసును వదిలేసినట్లు అందరూ భావించారు. కానీ అలా వదిలేయడానికి వారు సిద్ధంగా లేరనేది శనివారం ఉదయం జరిగిన సంఘటన రుజువు చేస్తోంది.
పోలీసులు శనివారం ఉదయం లోటస్ పాండ్లోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయానికి వెళ్లారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో ఐటి విభాగం ఇంచార్జీ మధు కోసం చూశారు. అతనెక్కడ అని అడిగారు. నోటీసులు జారీ ఇచ్చి, సోదాలు చేశారు. దాంతో ఒక్కసారిగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కదిలారు.
ఆఫీసుకు విజయసాయి, ఇతర నేతలు...
తమ పార్టీ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేస్తున్నారనే విషయం తెలుసుకున్న వైసిపి నేతలు విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యేలు, శ్రీనివాసులు, అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, జోగి రమేష్ తదితరులు సోషల్ మీడియా కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసు సోదాలపై అభ్యంతరం చెప్పారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలే తప్ప తాబేదారులుగా ఉండకూడదని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ రోజు జరిగినవే రేపు జరుగుతాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అన్నారు.
చట్టబద్దంగా వ్యవహరిస్తే అభ్యంతరం లేదు...
పోలీసులు చట్టబద్దంగా వ్యవహరిస్తే తమకు అభ్యంతరం లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని విజయసాయిరెడ్డి అన్నారు. పోలీసుల సమక్షంలోనే అసెంబ్రీ సచివాలయ కార్యదర్శికి ఫోన్ చేశారు. టిడిపి ఎమ్మెల్సీ టిడి జనార్దన్ ఫిర్యాదుపై మీరు ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు.
జగన్పై అలా పెట్టారు...
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్పై,త ఆయన కుటుంబ సభ్యులపై అవాకులు, చవాకులు పేలిన సంఘటనలు చాలా ఉన్నాయని, సభ్య సమాజం హర్షించలేని పోస్టింగులు జగన్పై పెట్టారని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ విషయంపై టిడిపి కార్యాలయంలో సోదాలు చేసే శక్తి మీకు ఉందా అని ఆయన పోలీసులను ప్రశ్నించారు. జగన్ను దూషిస్తూ మంత్రి లోకేష్ పెట్టిన ట్వీట్లను నేలు పోలీసులకు చూపించారు. వైసిపి కార్యాలయంలో అన్ని విభాగాలకు తానే ఇంచార్జీని అని, నోటీసులు ఇవ్వాలనుకుంటే తనకు ఇవ్వాలని, చర్యలు తీసుకుంటే తనపై తీసుకోవాలని ఆయన అన్నారు.
మధుకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని...
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఐటి వింగ్కు చెందిన చల్లా మధుసూదన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు వచ్చినట్లు పోలీసులు చెప్పారు. ఈ నెల 24వ తేదీన విచారణకు హాజరు కావాలని చెప్పారు. పోలీసులు రవి కిరణ్తో ఏం చెప్పించారో మాత్రం తెలియదు. వైసిపి కార్యాలయం నుంచి వేతనం తీసుకుంటున్నానని అంగీకరించాలని రవి కిరణ్పై ఒత్తిడి తెచ్చినట్లు చెబుతున్నారు. రవి కిరణ్ను వదిలేసిన తర్వాత పోలీసులు వైసిపి ఐటి వింగ్లో సోదాలు చేశారు.