మామకు పాజిటివ్-చూసొచ్చిన అల్లుడిపై కేసు-కుటుంబం క్వారంటైన్ కు....
కరోనా వైరస్ కారణంగా బంధువులను కలవడం కూడా కష్టమైపోతోంది. ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే, ప్రాణం పోతున్నా, పోయినా సరే బంధువుల దగ్గరకు వెళ్లే పరిస్దితి లేదు. తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లాల్లో కరోనా సోకిన మామను చూసేందుకు రహస్యంగా వెళ్లిన ఓ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. అతనితో పాటు కుటుంబం కూడా ఇప్పుడు చిక్కుల్లో పడింది.
మామకు కరోనా లక్షణాలు..
ప్రకాశం జిల్లా చీరాల మండలానికి చెందిన ఓ వ్యక్తి తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఉన్న మామ గారి ఇంటికి నాలుగేళ్ల కుమారుడిని పంపారు. లాక్ డౌన్ కంటే ముందే కుమారుడిని అక్కడ వదిలేసి వచ్చిన సదరు వ్యక్తి... ఆ తర్వాత మామగారికి గుండెపోటు రావడంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఆ సమయంలోనే సూర్యాపేట నుంచి తన కుమారుడిని కూడా ఆస్పత్రికి తీసుకొచ్చారు. మామ గారిని పరీక్షించిన వైద్యులు కరోనా పాజిటివ్ గా నిర్ధారించడంతో చికిత్స పొందుతున్నాడు.
రహస్యంగా చూసొచ్చిన అల్లుడు...
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న మామ గారిని లాక్ డౌన్ నిబంధనల మధ్య ప్రకాశం జిల్లా చీరాల నుంచి రహస్యంగా చేరుకున్న అల్లుడు సందర్శించాడు. మామకు ధైర్యం చెప్పిన తర్వాత కుమారుడితో కలిసి ఇంటికి వెళ్లిపోయాడు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. లాక్ డౌన్ ఉండగా... జిల్లాల మధ్య రహస్యంగా పర్యటించడం, నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసులు పెట్టారు.
Recommended Video
క్వారంటైన్ కు కుటుంబం...
అసలే గుంటూరు, ప్రకాశం జిల్లాలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. కరోనా సోకిన మామను అల్లుడు చూసొచ్చాడు. అదే ఆస్పత్రిలో ఉన్న కుమారుడిని కూడా ఇంటికి తీసుకొచ్చాడు. ఈ వ్యవహారమంతా గమనించిన పోలీసులు.. అధికారుల సాయంతో కుటుంబం మొత్తాన్ని క్వారంటైన్ కు తరలించారు. శాంపిల్స్ పరీక్షించాక నెగెటివ్ గా తేలితేనే ఇంటికి పంపిస్తామంటున్నారు. దీంతో ఆ కుటుంబం ఇప్పుడు లబోదిబోమంటోంది.