స్టేట్మెంట్ కోసం పోలీసులు రెండో లేఖ: '8 నెలలుగా జగన్ కదలికలపై నిఘా, శివాజీ సీక్రెట్స్ బయటపెట్టాలి'
అమరావతి/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ కోసం ఏపీ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. స్టేట్మెంట్ కోసం సమయం ఇవ్వాలని జగన్కు పోలీసులు బుధవారం మరో లేఖను పంపించారు. ఇది వారు పంపిన రెండో లేఖ.
కొన్ని విషయాలు దాస్తున్నాడు, డబ్బులు జమ అయ్యాయి: జగన్ కేసు నిందితుడి ఆరోగ్యంపై సీపీ
జగన్ సమాధానాన్ని బట్టి నిర్ణయం తీసుకునే యోచనలో ఏపీ పోలీసులు ఉన్నారు. తొలిసారి వాంగ్మూలం కోసం వెళ్లగా ఏపీ పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వమని వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి లిఖితపూర్వకంగా చెప్పారు.
ఎనిమిది నెలలుగా జగన్ కదలికలపై నిఘా
పథకం ప్రకారమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన హత్యాయత్నం జరిగిందని వైసీపీ నేత తమ్మినేని సీతారాం శ్రీకాకుళం జిల్లాలో అన్నారు. ఎనిమిది నెలలుగా జగన్ కదలికపై నిఘా పెట్టారని చెప్పారు. పథకంలో భాగంగానే నిందితుడు శ్రీనివాస రావును ఎయిర్ పోర్ట్ రెస్టారెంటులో ఉద్యోగంలో చేర్చారని చెప్పారు.
శివాజీ ఆపరేషన్ గరుడ రహస్యాలు బయటపెట్టాలి
జగన్ పైన దాడి కేసు విచారణ పక్కదారి పడుతోందని అనుమానం తమ్మినేని వ్యక్తం చేశారు. శ్రీనివాస రావుకు మీడియాతో మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నటుడు శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ వెనుక ఉన్న రహస్యాలను బయటపెట్టాలని తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు.
చంద్రబాబు పేరు చేర్చడం హాస్యాస్పదం
వైయస్ జగన్ తన పిటిషన్లో ప్రతివాదిగా ముఖ్యమంత్రి చంద్రబాబును చేర్చడం హాస్యాస్పదమని మంత్రి కొల్లు రవీంద్ అన్నారు. జగన్ పైన దాడి చేసింది వైసీపీ కార్యకర్త అని తేలి అంతా రాద్దాంతం చేస్తున్నారని ఆరోపించారు. జగన్కు తగిలింది చిన్న గాయమేనని డాక్టర్లు కూడా నిర్ధారించారని చెప్పారు.
బీజేపీతో కలిసి టీడీపీని దెబ్బతీసే ప్లాన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దోచుకున్న, నేరచరిత్ర కలిగిన పార్టీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని కొల్లు ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీతో, బీజేపీతో కుమ్మక్కైన జగన్ తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు.
వైసీపీ డిమాండ్కు శరద్ యాదవ్ మద్దతు
మరోవైపు, ఢిల్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పలువురు జాతీయస్థాయి నేతలను కలుస్తున్నారు. ఇందులో భాగంగా శరద్ యాదవ్తో వైసీపీ నేతల భేటీ ముగిసింది. జగన్పై హత్యాయత్నం కేసును నిష్పక్షపాతంగా దర్యాఫ్తు చేయాలన్నారు. న్యాయ విచారణ లేదా మరేదైనా సంస్థతో దర్యాఫ్తు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ డిమాండుకు శరద్ యాదవ్ మద్దతు తెలిపారు.
కారుకూతలు కూస్తే ఊరుకోం
జగన్ పైన దాడి ఘటనలో టీడీపీ నేతలు దళితులు అయినంత మాత్రాన జగన్ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారా అని వైసీపీ నేత మేరుగ నాగార్జున మండిపడ్డారు. మా నాయకుడి గురించి కారుకూతలు కూస్తే ఊరుకోమని చెప్పారు. నక్కా ఆనంద్ బాబు, జవహర్, శివాజీలు వ్యాఖ్యలు సరికాదన్నారు. దళితుల పేరిట తమ నాయకుడి గురించి కారుకూతలు కూస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
శ్రీనివాస రావుకు పూర్తి భద్రత
జగన్ పైన దాడి చేసిన నిందితుడు శ్రీనివాస రావుకు పూర్తిస్థాయిలో భద్రత కల్పిస్తామని ఏపీ హోంమంత్రి చినరాజప్ప అన్నారు. విపక్ష నేతలు ఈ అంశంపై అనవసరంగా రాద్దాంతం చేస్తున్నారని, కేసు విచారణలో ప్రభుత్వ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందన్నారు. కేసు విచారణ, శ్రీనివాస్కు భద్రత విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు.