12గంటలపాటు నిర్బంధం: చంద్రబాబుకు పోలీసుల నోటీసులు, లాడెన్తో పోలికపై లోకేష్ ఫైర్
అమరావతి: టీడీపీ అధినే, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు బుధవారం సాయంత్రం పోలీసులు నోటీసులు ఇచ్చారు. చలో ఆత్మకూరు పిలుపు నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. 12గంటల తర్వాత ఇంటి గేటుకు కట్టిన తాళ్లను తొలగించారు.
బుధవారం ఉదయం సుమారు 8గంటల ప్రాంతంలో కట్టిన తాళ్లను రాత్రి 8గంటల సమయంలో తొలగించి, సెక్షన్ 151 కింద నోటీసులు జారీ చేశారు. 12 గంటలపాటు నిర్బంధించడంతోపాటు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఆ నోటీసులు సరైన సమాచారం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, చంద్రబాబు హౌస్ అరెస్ట్, పోలీసులు నోటీసులు ఇవ్వడంపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'చంద్రబాబుగారు స్వయంగా పూనుకుంటే తప్ప ప్రభుత్వం కళ్ళు తెరవదా? ఉదయం 8 గంటల నుంచి అక్రమంగా మమ్మల్ని బైటికి రాకుండా నిర్బంధించి రాత్రి 8 గంటల వేళ నిర్బంధం సడలింపా? ఒక ప్రధాన ప్రతిపక్ష నేతకి ఏ అధికారంతో ఇటువంటి ఆంక్షలు విధించారు? బాధితులకు భరోసాగా ఎందుకు వెళ్లనివ్వలేదు?' అని నారా లోకేష్ మండిపడ్డారు.
'శిబిరానికి వెళ్లిన పోలీసులు అక్కడ మా నేతలని అరెస్టు చేసి బాధితులను భయభ్రాంతులకు గురిచేశారు. మీరు మీ ఊళ్లకు వెళ్లిపోండి మేము భద్రత కల్పిస్తాము అంటున్నారు. వైకాపా ప్రభుత్వ బాధితుల శిబిరం పెట్టి 9 రోజులు అయినా ఇటువైపు కన్నెత్తి చూడని పోలీస్ అధికారులకు ఇప్పుడే శిబిరం కనిపించిందా?' అని లోకేష్ ధ్వజమెత్తారు.
.@ysjaganగారూ! అసలీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్టా లేనట్టా? మీ గుడ్డి సర్కారుకు ఇలాంటి మార్ఫింగ్ పోస్టులు కనపడట్లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి పై ఇలాంటి పోస్టు పెట్టిన వాళ్ళపై చర్యలు తీసుకోడానికి చేతులు రావట్లేదా? చట్టాలు లేవా? మీ చట్టాలన్నీ తెదేపా అభిమానులమీద కేసులు పెట్టడానికేనా? pic.twitter.com/RgkjWNOTYP
— Lokesh Nara (@naralokesh) September 11, 2019
'@ysjaganగారూ! అసలీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నట్టా లేనట్టా? మీ గుడ్డి సర్కారుకు ఇలాంటి మార్ఫింగ్ పోస్టులు కనపడట్లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రి పై ఇలాంటి పోస్టు పెట్టిన వాళ్ళపై చర్యలు తీసుకోడానికి చేతులు రావట్లేదా? చట్టాలు లేవా? మీ చట్టాలన్నీ తెదేపా అభిమానులమీద కేసులు పెట్టడానికేనా?' అంటూ లోకేష్ నిలదీశారు.
'మూడు నెలలుగా ఇవ్వలేని నమ్మకం, భద్రత బాధితులకి ఇప్పుడు ఎలా అందిస్తారో ముఖమంత్రిగారు, హోమ్ మంత్రిగారు, రాష్ట్ర డీజీపీ సవాంగ్ గారు తక్షణమే ప్రజలకు తెలియజేయాలి. ప్రజల భద్రత విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తే తెదేపా పోరాటం మరింత ఉధృతం చేస్తాం' అని లోకేష్ స్పష్టం చేశారు.