లోకేష్ ముమ్మాటికీ పప్పే! ఏం చేస్తారో చేస్కోండి: విజయసాయిరెడ్డి సంచలనం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుసభ్యుడు విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నారా లోకేష్ ముమ్మాటికీ పప్పేనని.. ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండని సంచలన వ్యాఖ
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుసభ్యుడు విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నారా లోకేష్ ముమ్మాటికీ పప్పేనని.. ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా సిబ్బందిని పోలీసులు వేధిస్తున్నారంటే ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ పోలీసులు శనివారం హైదరబాద్లోని వైసీపీ సోషల్ మీడియా కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాసులు, అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు, జోగి రమేష్ తదితరులు హుటాహుటిన కార్యాలయానికి చేరుకున్నారు. సోదాలు చేస్తున్న పోలీసుల చర్యలకు అభ్యంతరం తెలిపారు.
ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పోలీసులు నిష్పాక్షికంగా వ్యవహరించాలే తప్ప, తాబేదారులుగా ఉండకూడదన్నారు. ఇవ్వాళ జరిగినవే రేపు కూడా జరుగుతాయని, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.
వైసీపీ సోషల్ మీడియా సిబ్బందిని వేధించడం సరికాదని అన్నారు. అంతేగాక, వైసీపీ అనుబంధ విభాగాలన్నింటికీ తానే ఇంఛార్జీనని, ఏమైనా చర్యలు తీసుకోవాలంటే తనపైనే తీసుకోండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జగన్ కుటుంబంపై టీడీపీ దారుణమైన పోస్టింగ్స్ చేసిందని గుర్తు చేశారు. అప్పుడెందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో టీడీపీ కార్యాలయంలో సోదాలు చేసే శక్తి మీకు ఉందా? అని ప్రశ్నించారు.
కాగా, వైసీపీ సోషల్ మీడియా ఐటీ వింగ్ కు చెందిన చల్లా మధుసూదన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని, ఏప్రిల్ 25న విచారణకు హాజరుకావాలని ఏపీ పోలీసులు సూచించారు. ఈ మేరకు చల్లా మధుసూదన్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
మేం కూడా కేసులు పెడతాం
వైసీపీపై తెలుగుదేశం పార్టీ వెబ్సైట్లలో పెట్టే కామెంట్లపై తాము కూడా కేసులు పెడతామని వైసీపీ లీగల్ సెల్ నేత సుధాకర్ పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సోషల్ మీడియా వచ్చిన వార్తలను ఆధారంగా చేసుకుని కేసులు పెట్టడం సరికాదన్నారు.